మిషన్‌ భగీరథ ఆదర్శంగా దేశవ్యాప్తంగా మంచినీటి పథకం

మిషన్‌ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతో పాటు, మురుగు నీటిని ట్రీట్‌ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ స్వరూపాన్ని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు ఉపరితల జలాలను మంచినీరుగా అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణ రాష్ట్రంలో చాల చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్‌ సమస్య ఉండేది. అసలే తాగునీళ్లు దొరకకపోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రతి రోజు ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ చేశాము. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దు” అని ముఖ్యమంత్రి వివరించారు. ”దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచి నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నది. కాబట్టి మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి” అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.

11వ శతాబ్దంలోనే కాకతీయులు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సిఎం చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ, విషన్‌ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టిఆర్‌ఎస్‌ లోక్‌ సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, కేంద్ర జల్‌ శక్తి శాఖ పరమేశ్వరన్‌ అయ్యర్‌, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్‌, మిషన్‌ భగీరథ ఇఎన్సీ కృపాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.