తెలంగాణ పోలీస్‌ శాఖకు 2 జాతీయ అవార్డులు

తెలంగాణ పోలీస్‌ శాఖకు,ఉత్తమ పనితీరు కనబరిచినందుకు, రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డీఎస్‌సీఐ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కాం) సంయుక్తంగా వివిధ దర్యాప్తు ఏజెన్సీలకు వేరు వేరు క్యాటగిరీలలో అవార్డులను ప్రకటించాయి.మొదటి అవార్డు, సైబర్‌ నేరాల దర్యాప్తులో అనుసరిస్తున్న వ్యూహాలు, సిబ్బందిని సైబర్‌ వారియర్స్‌గా మార్చే విధానంలో తీసుకునే చర్యలకు సంబంధించి డీఎస్‌సీఐ ఎక్సలెన్స్‌ అవార్డు-2021 లభించింది.ఆ విధంగా పోలీస్‌ ఏజెన్సీల సామర్థ్యాల పెంపుదలలో మొదటి స్థానంలో నిలిచింది.

వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌శాఖ కార్యదర్శి అజయ్‌సాహ్ని చేతుల మీదుగా రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసీజేఎస్‌) అమలు విధానంలో తెలంగాణ, జార్ఖండ్‌ రాష్ట్రాలు దేశంలో మూడో స్థానంలో నిలిచాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకటించిన ఈ అవార్డును హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సంయుక్తంగా స్వీకరించారు.