‘పద్మశ్రీ’ గ్రహీతలకు ముఖ్యమంత్రి నజరానా
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.

పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో సీఎంను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం:
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణం ఖర్చులకోసం ఒక కోటి రూపాయలను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.