ఎల్బీనగర్‌లో అభివృద్ధి పనులు

ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలో గల ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ. 55 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తొలుతగా ఎస్‌ఎన్‌డిపి ద్వారా బండ్లగూడ చెరువు నుండి నాగోల్‌ చెరువు వరకు రూ. 7.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలాను ప్రారంభించారు. ఫతుల్లగూడ సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ నుండి మహవీర్‌ హరణి వనస్థలి నేషనల్‌ పార్కు మీదుగా పీర్జాదీగూడ వరకు రూ. 26.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పీర్జాదీగూడ లింక్‌ రోడ్డును, ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో రూ. 84 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల స్మశానవాటికను, రూ. 16.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ, క్రిస్టియన్‌ స్మశానవాటిక, ముస్లింల కబరస్థాన్‌, వనస్థలిపురంలో స్విమ్మింగ్‌ పూల్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో రూ.55కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓ వైపు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందేలా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్‌ కిట్‌ వంటి వంద రకాల సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటూ మరో వైపు ఇంకా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరో వైపు అభివృద్ధి కొత్త నమూనాను భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ, పల్లె అభివృద్ధి, పరిశ్రమలు -పర్యావరణం, వ్యవసాయం – ఐటీ సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్‌ హెలిస్టిక్‌ మోడల్‌ను భారతదేశం ముందు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో రూ. 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6లక్షల కోట్లని, ఈ రోజు 11.55లక్షల కోట్లుగా ఉందన్నారు. ఛూమంతర్‌ అనగానే, అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా ఓ భూతాన్ని బయటకు తీసి పెంచమనీ అంటే పెరుగలేదని, నోటిమాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, చిత్రవిత్రమైన వేషాలు వేసుకొని ఫోజులు కొడితే జరుగలేదన్నారు. ప్రణాళికా బద్ధంగా, క్రమశిక్షణతో ప్రజల అవసరాలేమిటి రాష్ట్రం ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనతో పని చేస్తే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. ఇవాళ కేంద్రం భారతదేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని, స్వయంగా కేంద్రం చెబుతున్నదని, అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయని లెక్కదీస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. పల్లె, పట్టణ ప్రగతితో అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో సమతుల్యమైన అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని కేటీఆర్‌ అన్నారు.

భవిష్యత్‌లో రాష్ట్రం బాగుండాలనే సోయి ఉండే నాయకులు, సోయి ఉండే ప్రభుత్వం ఉంటే చెట్లు, పర్యావరణం గురించి పట్టించుకుంటారన్న కేటీఆర్‌ గతంలో ఫతుల్లగూడ ఏరియా ఒకప్పుడు అడుగుపెట్టరాకుండా, దుర్వాసన, అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను సంస్కారవంతంగా చేసుకునేలా ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. బతికి ఉన్నన్ని రోజులు కులం, మతం, భాష, ప్రాంతం పేరుమీద కొట్టుకుంటూనే ఉంటామన్న కేటీఆర్‌.. చివరకు చనిపోయిన తర్వాత మంచిగుండాలని చెప్పి హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ మతాల వారందరికీ వారి వారి ఆచారాలు, ధర్మాలకు అనుగుణంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు.

ఎస్‌ఎన్‌డీపీ పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 985 కోట్లతో 56 పనులను చేపట్టడం జరిగింది. అందులో జిహెచ్‌ఎంసి ద్వారా రూ. 724 కోట్లతో 34 పనులను చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు రెండు పనులు పికెట్‌ నాలాపై బ్రిడ్జి, బండ్లగూడ చెరువు నుండి నాగోల్‌ చెరువు వరకు నాలా పనులు పూర్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ సర్ఫేస్‌ నాలా, బల్కాపూర్‌ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామన్నారు. జిహెచ్‌ఎంసి చుట్టుపక్కల మున్సిపాలిటీలలో రూ. 240 కోట్లతో 21 పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎస్‌ఎన్‌డీపీ కింద నగరం నలుమూలలా ఉండే నాలాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులు చేపడతామని అన్నారు. హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తోందని, ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీలు వస్తున్నాయన్నారు.

దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి స్థిరపడుతున్నారని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాకుండా భారతదేశం లోని వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో మౌలిక వసతులు పెరగకపోతే బెంగళూరులా వెనుకబడిపోతామని అన్నారు. ఫతుల్లాగూడ నుండి ఫీర్జాదిగూడ వరకు చేపట్టిన రోడ్డును హైదరాబాద్‌ నేషనల్‌ హై వేకు, ఓ.ఆర్‌.ఆర్‌కు అనుసంధానం చేసేందుకు రూ. 34 కోట్లతో రోడ్డును మూసీ నది పై రూ. 52 కోట్లతో వంతెనను నిర్మిస్తున్నట్లు, తద్వారా వరంగల్‌ వెళ్లేందుకు సులభతరం అవుతుందని, మూసీ పై కొత్తగా జిహెచ్‌ఎంసి ద్వారా 14 వంతెనలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆటోనగర్‌ లోని ఖాళీ స్థలంలో ప్లవర్‌ గార్డెన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎస్‌ఎన్‌డి నాలాల అభివృద్ధికి రవాణా సౌకర్యం కోసం ఎస్‌ఆర్‌డిపీ పథకాలు రోడ్ల నిర్వహణకు సిఆర్‌ఎంపి పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణాకు కూడా పెద్ద పీట వేయనున్నట్లు మంత్రి అన్నారు. మొదటి దశలో చేపట్టిన మెట్రో ఎల్‌ల్బీ నగర్‌, నాగోల్‌ వరకు పూర్తి చేయడం జరిగింది. నాగోల్‌ నుండి ఎల్బీ నగర్‌ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఎల్బీనగర్‌ నుండి హయత్‌ నగర్‌ వరకు మెట్రోను ఎన్నికల తర్వాత విస్తరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, మరోసారి సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో 12,700 గ్రామాలలో హరితహారం ద్వారా మొక్కలు నాటడం, ప్రతి ఒక్క గ్రామంలో డంపింగ్‌ యార్డ్‌, స్మశాన వాటిక ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందని, 8 ఏళ్ల ముందు హైదరాబాద్‌ లో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాసులు లేవని, ఇప్పుడు అవన్నీ ఏర్పాటు చేయడం మూలంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా అభివృద్ధి జరుగుతున్నట్లు మంత్రి అన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్‌ అభివృద్ధి చూసి ఇతర రాష్ట్రాలు జెలసిగా ఫీలవుతున్నాయని అన్నారు. కొన్ని దుష్ట శక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నా ముఖ్యమంత్రికి, వాటికి భయపడకుండా ఎదుర్కొనే శక్తి ఉందని మంత్రి అన్నారు.

ఎల్బీనగర్‌ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ…. ఆటో నగర్‌ ఖాళీ స్థలంలో ఫ్లవర్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఫతుల్లగూడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హిందూ, క్రిస్టియన్‌ స్మశాన వాటిక ముస్లిం ఖబ్రస్తాన్‌, విదేశాలలో ఉన్న బంధువులు కూడా అంతిమ దహన సంస్కారాలు ఇక్కడ నుండే తిలకించేందుకు వెసులుబాటు ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పెంపుడు కుక్కల స్మశాన వాటిక ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.