|

గ్రేటర్‌లో సిద్ధమవుతున్న లక్ష పేదల సౌధాలు

By: కన్నెకంటి వెంకటరమణ

  • వనస్థలిపురంలో 324 గృహప్రవేశాలు

నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో వనస్థలిపురం రైతుబజారు వద్ద నిర్మించిన 324 ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అందజేశారు. నిరుపేదల సొంతింటి
కల సాకారం కావడంతో అత్యధిక శాతం గిరిజన, హరిజన బలహీనవర్గాలు లబ్ధిదారులుగా ఉన్న ఈ రైతు బజార్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కే.సీ.ఆర్‌కు తమ జీవితాంతం
రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

28.03 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 324 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే డి.సుధీర్‌ రెడ్డి తదితరులు అందజేశారు. దీనితో కలిపి పంపిణీ చేసిన ఇండ్లు 1800 కాగా, మరో 21 వేలపైచిలుకు ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 53 వేల గృహాల నిర్మాణం పూర్తి కాగా, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి. జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ఇండ్లు మరో పది వేలు కూడా పంపిణీకి చర్యలు తీసుకుంటుండగా, వీటిని దశలవారిగా అందజేయాలని నిర్ణయించారు.

జి.హెచ్‌.ఎం.సి పరిధిలో రూ. 9714.59 కోట్ల వ్యయంతో పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 107 ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. సింగం చెరువు, చిత్తారమ్మ బస్తీ, కిడ్కీ బూద్‌ అలీషా, సయిద్‌ సాబ్‌ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ తదితర ఆరు కాలనీల్లో ఇండ్లను ఇప్పటికే పంపిణీ చేశారు. మొత్తం ఏడు కాలనీల్లో కలిపి ఇప్పటివరకు సుమారు 1800 ఇండ్లను నిర్మించి అందజేశారు. మరో 16 కాలనీల్లో 21,100 ఇండ్లు నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్‌ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని మంత్రి కె.టీ.రామారావు అన్నారు. వనస్థలిపురం రైతుబజార్‌ సమీపంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కే.టీ.ఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల వంటివి స్వాతంత్రం సిద్ధించిన 72 సంవత్సరాల చరిత్రలో దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదని పేర్కొన్నారు. నాణ్యతపరం గాను ఈ ఇళ్లకు సాటిలేవని, నిరుపేదలు కూడా ఆత్మ గౌరవంతో ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారని కే.టీ.ఆర్‌ చెప్పారు. వనస్థలిపురంలో సెల్లర్‌, స్టిల్ట్‌, 9 అంతస్తులలో మూడు బ్లాకుల్లో నిర్మించిన ఈ 324 డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు మార్కెట్‌ లో దాదాపు రూ. 150 కోట్ల విలువ చేస్తుందని వెల్లడిరచారు. ఇక్కడి భూమి విలువ మార్కెట్‌ లో గజానికి రెండు లక్షల విలువ ఉందని అన్నారు. ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో నివసించే లబ్ధిదారులు తమ ఇళ్లలో ఏవిధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల యాజమాన్య పట్టాలను మంత్రులు కే.టీ.ఆర్‌, సబితా ఇంద్రారెడ్డిలు అందచేశారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో సకల సౌకర్యాలు
మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో ఒక లివింగ్‌ రూమ్‌, రెండు బెడ్‌ రూమ్‌ లు, ఒక కిచెన్‌ రూమ్‌, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించారు. ఈ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలైన త్రాగు నీరు, విద్యుత్‌ సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, లిఫ్ట్‌ సౌకర్యం, ఫైర్‌ సేఫ్టీ, సీ.సీ.రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎల్బీ నగర్‌ శాసన సభ్యులు డీ.సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్లు ఉప్పల శ్రీనివాస్‌, లక్ష్మీ నారాయణ, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.