సింగరేణి ‘థర్మల్’కి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు
సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డులను ప్రకటించే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ (ముంబయి) సంస్థ వారు 2021 వ సంవత్సరానికి ‘‘ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు.

దక్షిణ భారత దేశంలో 500 మెగావాట్లు ఆ పై స్థాయి ఉత్పత్తి సామర్థ్యం గల సుమారు వంద ప్లాంట్ల విభాగంలో ఈ అత్యుత్తమ అవార్డును సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఒక యూనిట్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి 2444 కిలో కాలరీల శక్తి ని ( బొగ్గును) వినియోగించవచ్చని ప్రామాణికంగా సూచిస్తుంటారు. కాగా, 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల రెండు ప్లాంట్లలో ఒకటో ప్లాంట్ ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కి నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువగా సగటున 2425 కిలో కాలరీల శక్తిని (బొగ్గును) మాత్రమే వినియోగిస్తోంది. ఈ విధంగా అత్యంత సమర్థంగా బొగ్గును వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును’ ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తక్కువ బొగ్గు తో తగిన ఉష్ణోగ్రతను సాధించడం , ప్లాంట్ అవసరాలకు విద్యుత్, ఆయిల్ వినియోగంలోనూ పొదుపు పాటించడం తో ఈ అవార్డుకు ఎంపికైంది.
దీనిపై సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేస్తూ ప్లాంట్ అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే ఈ ప్లాంట్ మంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని, ఇదే పనితీరును కనబరుస్తూ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది దక్షిణ భారత స్థాయిలో వరుసగా నాలుగు అవార్డులు..
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమై కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ తన పనితీరుతో, అవలంబిస్తున్న అత్యుత్తమ నిర్వహణ పద్ధతులతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు వంద థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదర్శప్రాయంగా ఉంటోంది. గత ఏడాది ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాల విభాగంలో అత్యుత్తమ పీఎల్ఎఫ్ సాధించిన ప్లాంట్లలో దేశంలోనే రెండో స్థానం సాధించి తన ప్రతిభను చాటుకుంది. కాగా, ముంబయికి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ ఈ ఏడాది దక్షిణ భారత స్థాయి లో మూడు అవార్డులను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అందజేశారు. ఇందులో వాటర్ ఎఫిషియెన్సీ ప్లాంట్ అవార్డు, బెస్ట్ పవర్ ప్లాంట్ పర్ఫార్మర్ అవార్డు, బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్ అవార్డులు ఉన్నాయి.
కాగా, తాజాగా సమర్థంగా ఇంధనాన్ని(బొగ్గును) వినియోగిస్తున్నందుకు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు కు ఎంపికైందని, త్వరలో ఈ అవార్డును స్వీకరించనున్నామని సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) డి.సత్యనారాయణ రావు తెలియజేశారు.