తొలి కేజీ టూ పీజీ క్యాంపస్
By:- మామిండ్ల దశరథం

మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారం
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు కేజీ స్థాయి నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ దిశగా తొలి అడుగు పడింది.
మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారంతో తెలంగాణలో కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఒకే చోట విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తొలి విద్యాలయం నిర్మాణం పూర్తి అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టూ పీజీ విద్యాలయాన్ని నిర్మించారు.
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3,500 మంది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధమవుతున్నాయి.
అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకేసారి కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వసతులతో వంట గదితో పాటు సామగ్రిని నిల్వ చేసేందుకు ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. 50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రం సిద్ధం చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయి వసతులతో 4500 చదరపు అడుగుల్లో క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు. 45వేల చదరపు అడుగులలో క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రోటర్ఫ్ ప్లే మైదానంగా తీర్చిదిద్దారు. త్వరలోనే ఈ క్యాంపస్ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రత్యేకతలు ఇవే
- ప్రీ ప్రైమరీ నుంచి పోస్ట్గ్రాడ్యుయేషన్ దాకా ఒకే చోట సర్కారీ చదువు
- 3500 మంది విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం
- అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో క్రీడా మైదానం
- వెయ్యి మంది భుజించేలా డైనింగ్హాల్
- ఇంకా డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్
- అందుబాటులోకి డిగ్రీ, బాలుర ఉన్నత పాఠశాల గదులు