యాదాద్రీశా గోవిందా!
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా యాదాద్రి ఆలయం పునః ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ‘నమో నారసింహా.. యాదాద్రీశా గోవిందా..అంటూ పాంచనారసింహుని నామస్మరణలతో, భక్తుల జయ జయధ్వానాల నడుమ తెలంగాణ తన స్వంత అస్తిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభ నూతన రూపును సంతరించుకున్నది. యాదాద్రి పునర్నిర్మాణంతో తెలంగాణ సనాతన ధార్మిక ఆధ్యాత్మిక భక్తి చరిత్ర సువర్ణాక్షరాలతో తనను తాను పునర్లిఖించుకున్నది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ స్వయంభూ పంచ నారసింహ క్షేత్రమైన శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత భక్తి శ్రద్ధలతో అహర్నిశలు శ్రమించారు. కృష్ణశిల నిర్మాణంలో నృసింహ ఆలయమును ఒక అద్భుతమైన రీతిలో నిర్మాణం గావించారు. యావత్ భక్తకోటికి స్వరగోపురాలతో, స్వర్ణమయ శిఖరాలతో, ధ్వజస్తంభంతో, ఇతర నృసింహ సంబంధమైన సమస్తాన్ని బంగారుమయం కావించిన మహనీయులు, భక్తవరేణ్యులు సిఎం కెసిఆర్. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రియాతి ప్రియమైన ఆలయ నిర్మాణ కర్తగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2022 మార్చి 28న జరిగిన ఈ వేడుకలో సకుటుంబంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక భక్తి చరిత్రలో మహాద్భుత ఘట్టానికి కారణభూతులయ్యారు. భక్తకోటి ఎదురుచూస్తున్న మహాద్భుత ఘట్టం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త మిథున లగ్న అభిజిత్ ముహూర్తాన.. నవ వైకుంఠం తీరుగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.

అంతకు ముందు ఉదయం.. చతుస్థానార్చనలు, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, బలిహరణం, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, గర్రన్యాసము, రత్నన్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్ట బంధనం, కళారోపణం, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, దృష్టి కుంభం వంటి పూజలను ఘనంగా జరిపిన ఆలయ అర్చకులు అనంతరం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు.
మహా కుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొన్నారు. దివ్య విమాన గోపురంపైని శ్రీ సుదర్శన చక్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసారు. పవిత్ర కాళేశ్వరుని గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. కేసీఆర్కు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదే సందర్భంలో.. సప్త గోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు., దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆయా గోపురాల పై యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ చేశారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలను ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞ చార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణీకులు అత్యంత వైభవముగా నిర్వహించారు. యాదాద్రి పునర్నిర్మాణ ఘట్టం ఇలా సాగింది.

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 8.52 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో కుటుంబ సమేతంగా యాదాద్రి బయలు దేరిన, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, యాదాద్రి చేరుకున్నారు. ఉదయం 9:50 గంటలకు బాలాలయంలో కవచమూర్తులను, ఉత్సవమూర్తుల ఊరేగింపుగా శోభాయాత్రను కేసీఆర్ దంపతులు పల్లకి మోసి ప్రారంభించారు. ప్రదక్షిణల అనంతరం 10:39 గంటలకు ప్రధానాలయం తూర్పు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడినుంచి ముఖమండపానికి ఉత్సవమూర్తులు చేరుకున్న అనంతరం విమాన గోపురం, వివిధ రాజ గోపురాలపై అర్చకులు పూజలు ప్రారంభించారు. 11:40 గంటలకు ప్రధానార్చకులు మహాసంకల్పాన్ని ప్రారంభించారు. 11:55 గంటలకు దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు.
కేసీఆర్కు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనమిచ్చారు. సప్త గోపురాలపై కలశాలకు ఏకకాలంలో పలువురు మంత్రులు ప్రజా ప్రతినిధులతో అర్చకులు కుంభాభిషేకం, సంప్రోక్షణ కావించారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం మూల విరాట్టు వద్దకు చేరుకుని పునః ప్రారంభ పూజలు నిర్వహించారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని మహాకుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభం చేసిన అనంతరం కేసీఆర్ దంపతులు.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, భోజన ఆతిథ్యాలు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరారు.
ఉత్సాహంగా శోభాయాత్ర:
బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో ఆలయ అర్చకులు, వేద పండితులతో పాటు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బంగారు కవచమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణలు, మేళ తాళాల నడుమ, కళా ప్రదర్శనలతో శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. యాదాద్రి ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకీని మోశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారసింహుని నామస్మరణతో యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శోభాయాత్ర ద్వారా ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో జయజయ నృసింహ, నమో నారసింహ మంత్రం అంతటా ప్రతిధ్వనించింది. మహా కుంభ సంప్రోక్షణ శాస్తోక్తంగా ముగియగానే జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం, పునః ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

యాదాద్రి నిర్మాణంలో భాగస్వాములకు ఘన సత్కారం:
ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములై పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన స్థపతులకు పండితులకు పలువురు అధికారులను సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఆలయ ఈవో ఎన్.గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్ రాజన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావులను ప్రత్యేకంగా కేసీఆర్ శాలువాలతో సత్కరించి, సన్మానించారు.
ఇంతటి చారిత్రక ఘట్టానికి పాంచ నారసింహుని ఆశీస్సులతో..కర్త కర్మ క్రియ అయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని … ఆలయ ఈవో ఎన్.గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. నరసింహ స్వామి వారి ఫొటోను సీఎంకు బహుకరించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ సత్కారం అందుకున్న వారిలో… ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న ఆర్కిటెక్టు పి.మధుసూదన్, సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డి, ఎస్.ఈలు జీ.వసంత్ నాయక్, వై లింగారెడ్డి, ఈఈలు ఎం.వెంకటేశ్వర్ రెడ్డి, వీవీ రామారావు, శంకర్ నాథ్, కె.రమేశ్, జియో టెక్నికల్ ఇంజనీర్ డాక్టర్ డి.బాబూరావు, ప్రొఫెసర్ ఆర్. రమేశ్ రెడ్డి, ఆలయ శిల్పులు బాలాజీ, అండియప్పన్, ముని, వెంకట్ రెడ్డి, రబ్బానీ, యునిష్, సుబ్బారావు, శరవణన్, సెల్వకుమార్, గణేషన్, మనోహరన్, రవీంద్రాచారి, త్యాగరాజన్, సెల్వం, మణి, రవీంద్రన్ తదితరులన్నారు.

ఈ చారిత్రక ఘట్టంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులున్నారు.