కార్మిక బీమా.. భవితకు ధీమా
By: పి. సీతారాం, నాగర్కర్నూలు
భవన నిర్మాణ కార్మికుడు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాకపోతే ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయం. ఇంటి పెద్ద అయిన కార్మికుడు ప్రమాదవశాత్తు లేదా సాధారణంగా చనిపోతే.. ఆ కుటుంబానికి ఒక్క రూపాయి సాయం చేసేవారు ఉండరు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగం బోర్డు కార్మిక బీమా పథకాలు అనేకం అమలు చేస్తున్నాయి. కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఆ కుటుంబాలకు ధీమానే.
నాగర్కర్నూలు జిల్లాలో భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నిర్మాణ కార్మికులు సుమారు 1 లక్ష మందికి పైగా ఉన్నట్లు అంచనా. వీరిలో 33 వేల మంది మాత్రమే కార్మిక చట్టం 1998 నిబంధనల ప్రకారం తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగం బోర్డులో పేర్లు నమోదు చేయించుకున్నారు. మిగిలిన వారు అవగాహన రాహిత్యంతో పేర్లు నమోదు చేయించుకోలేదు. అసంఘటిత కార్మికులకు నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా…
ఎవరి సిఫార్సు లేకుండా కార్మికశాఖ ఇచ్చిన దరఖాస్తు ఫారం నింపి రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. సొంతంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయిదేళ్లపాటు సభ్యుడిగా కొనసాగవచ్చు. నెలకు రూ.1 చొప్పున ఏడాదికి రూ.12 చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోకపోతే రాయితీలు వర్తించవు.
ఏఏ వృత్తుల వారికి ప్రయోజనం అంటే…
ప్రాజెక్టుల నిర్మాణ, భవన, రోడ్డు నిర్మాణ కార్మికులు, మట్టి పని, ఫ్లోరింగ్ పనిచేసేవారు, రాడ్డు బెండింగ్, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటింగ్, ప్రొక్లెయిన్ కార్మికులు, ఇటుక బట్టీలో పనిచేసేవారు, క్వారీ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరొచ్చు.
అందుబాటులో అనేక సౌకర్యాలు..
కార్మికుడుగా పేరు నమోదు చేయించుకున్న వారికి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల 30 వేలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.4లక్షలు వర్తిస్తుంది.
సాధారణ మరణమైతే రూ.1 లక్ష 30వేలు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు 50 శాతం అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.4లక్షల పరిహారం వర్తిస్తుంది.
చిన్నచిన్న దెబ్బలు తగిలి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఐదురోజులు దాటితే పోషణ నిమిత్తం రోజుకు రూ.100 వంతున నెలకు రూ.1500 మించకుండా పొందొచ్చు. ఈ సదుపాయం 3నెలల వరకు వర్తిస్తుంది. కార్మికుడు పని ప్రదేశంలో చనిపోతే ఇంటికి చేర్చేందుకు అయ్యే ఖర్చు కార్మికశాఖ చెల్లిస్తుంది. అంత్యక్రియల నిమిత్తం రూ.30వేలు మృతుడి కుటుంబానికి అందిస్తారు.
ప్రసూతి సహాయం: కార్మికురాలు, కార్మికుడి భార్య, లేదా ఇద్దరు బిడ్డలకు ఈ సదుపాయం ఉంది. ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో కాన్పు అయితే రూ.30 వేలు ఇస్తారు. ఈ సదుపాయం రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. ముందుగా కార్మిక శాఖలో పేరు నమోదు చేయించుకోవాలి.
వివాహ బహుమతి: ఈ పథకం కింద రిజిష్టర్ అయిన అవివాహిత మహిళా కార్మికురాలు, కార్మికుడి ఇద్దరు కుమార్తెలకు ఈ పథకం వర్తిస్తుంది. కార్మికుడి కుమార్తె వివాహ సమయంలో రూ.30వేలు ఆర్థిక సాయం అందుతుంది. పెళ్లి, వయస్సు, ధ్రువీకరణ పత్రం, ఫొటో, వివాహ ధ్రువీకరణ పత్రం సహాయ కార్మిక అధికారికి అందజేస్తే ఈ నగదు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందించినప్పటికీ కార్మికులకు ఈ పథకం ద్వారా అదనంగా అందిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగ, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకొని తమ పై ఆధారపడ్డ కుటుంబాలకు బాసటగా ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ-శ్రం (e-shram) ద్వారా కార్మికులకు బీమా సదుపాయం కల్పిస్తుంది. మీ సేవ కేంద్రంలో తమ ఆదార్ కార్డు, బ్యాంక్ వివరాలు, ఫోటోతో వెళితే మీ సేవ/ ఈ-సేవ కేంద్రంలో బీమా గుర్తింపు కార్డు జారి చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద కార్మికుడు ప్రమాద వశాత్తు చనిపోతే రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం, సాధారణ మరణమైతే రూ. ఒక లక్ష వరకు ఆర్ధిక సహాయం అందుతుంది.
ఇక ఆలస్యమెందుకు ప్రతి గ్రామంలోని కార్మికుడు నిర్మాణ, భవన రోడ్డు నిర్మాణ కార్మికులు, మట్టి పని, ఫ్లోరింగ్ పనిచేసేవారు, రాడ్డు బెండిరగ్, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటింగ్, ప్రొక్లెయిన్ కార్మికులు, ఇటుక బట్టీలో పనిచేసేవారు, క్వారీ కార్మికులు, కూరగాయలు అమ్మేవారు సైతం వెంటనే మీ సేవ/ ఈ సేవ/ లేబర్ ఆఫీస్కు వెళ్లి ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న అద్భుతమైన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుందాం.