పంజాబ్ క్రీడాకారిణికి కెటిఆర్ ఆర్థిక సహాయం
పంజాబ్కు చెందిన మూగ బధిర చెస్ క్రీడాకారిణి మాలిక హండకు మంత్రి కే. తారకరామారావు ఆర్థిక సహాయం అందించారు. మాలిక తన అద్భుతమైన చెస్ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక పతకాలు గెలిచినా, తనకు ఎలాంటి సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పొస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వైకల్యాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సహకారం అందించేందుకు మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్లోని జలంధర్ నుంచి హైదరాబాద్ పిలిపించి ఆమెకు ఆర్థిక సహాయం చేశారు.

తాను తన వ్యక్తిగత స్థాయిలో సహాయం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మాలికకు తగిన ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అమెకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ఒక లాప్టాప్ను అందించి, ఆమెని సన్మానించారు. మూగ, చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కెటిఆర్ మాలికతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాలికకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావన్నారు. మాలిక సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతోందని, ఆమె మరింత సహాయం, ప్రసంశలకు అర్హులన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం వైకల్యం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే పాలసీని తయారు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీతో ముందుకు వచ్చేందుకు తనకెదురైన అనుభవాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

మాలికకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
సుదూరాన ఉన్న పంజాబ్కి చెందిన తన ఆవేదనను చూసి అండగా ఉండేలా సహాయం చేసిన మంత్రి కేటీఆర్కి ఈ సందర్భంగా మాలిక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తానన్న విశ్వాసాన్ని అమె వ్యక్తం చేశారు. కేటీఆర్ మానవీయ స్పందన పట్ల మాలిక కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.