విద్యా వ్యవస్థ బలోపేతానికే మన ఊరు – మన బడి

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన మౌలిక వసతులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యాభివృద్ధికై ముఖ్యమంత్రి మానస పుత్రిక లాంటి ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో 26 వేల పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మొదటి విడుతలో 9 వేల పాఠశాలలను ఎంపిక చేయడం జరిగినదని, అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించిందని, ఇది చరిత్రాత్మకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లాలో మొదటగా రాచాలూరు గ్రామంలో ప్రారంభించడం జరిగిందని, పిల్లలు అందరూ పాఠశాలకు వచ్చి బాగా చదవాలన్నారు. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు త్రాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.
విద్యతో పాటు మంచి భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7200 కోట్లను మంజూరు చేసి అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు మనబడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి అన్నారు. పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపా యాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు. డ్యూయల్ డెస్క్ బెంచ్లు, గ్రీన్ బోర్డులు, విద్యుదీకరణ, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదుల నిర్మాణం, తాగునీటి ట్యాంకుల నిర్మాణం వంటి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతోందని తెలిపారు.
సామాన్య, మధ్య తరగతి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయు లు బాధ్యతగా పాఠశాలకు హాజరై విద్యా బోధన చేయాలని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి, టీచర్లకు శిక్షణ ఇచ్చి బోధన చేపట్టడం జరిగినదని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. జిల్లాలోని మిగతా పాఠశాలలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెలవులు వస్తే పాఠశాల ఆవరణ ఏలాంటి చెత్తాచెదారం ఉండ కుండా, ఇతరులు ఎవ్వరు కూడా కాంపౌండ్లోకి రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని, గ్రామస్తులు బాధ్యత తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, దాదాపు 22 లక్షల ఖర్చు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ గురుతర బాధ్యతను నిర్వహించాలని సూచించారు.