స్వచ్ఛ హైదరాబాద్లో భాగస్వాములు కావాలి: కెటిఆర్
సిఎం దిశా నిర్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిపూర్ణంగా విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐ.టి చేనేత పరిశ్రమలశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సనత్ నగర్ ప్లే గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 1350 స్వచ్ఛ ఆటోలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ ఆలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్లతో కలిసి 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో బాగంగా సిఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండే ఉద్దేశ్యంతో 2500 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో 40లక్షల పైబడిన జనాభా విభాగంలో హైదరాబాద్ నగరానికి అవార్డు వస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా అవార్డు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. మూడు, నాలుగు గంటలు శ్రమపడి ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మునిపల్ సిబ్బంది, హైదరాబాద్ నగర ప్రజల తరుపున అభినందనలు తెలిపారు. ‘సఫాయి అన్న సలామ్’ అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతోనే సరిపెట్టకుండా 3 సార్లు గౌరవ వేతనం పెంచినట్లు చెప్పారు.
2500 స్వచ్ఛ అటోల పంపిణీ కంటే ముందు హైదరాబాద్ నగరంలో 3500 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలను సేకరించే వారన్నారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. నేటికీ అది 6500 మెట్రిక్ టన్నులు సేకరణ చేయడం జరుగుతున్నది. వాహనాల ద్వారా సేకరించిన చెత్తను సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. తద్వారా మెరుగైన పారిశుద్ధ్యానికి వెసులుబాటు కలిగింది. జిహెచ్ఎంసి పరిధిలో 1350 స్వచ్ఛ ఆటోలు కలిసి మొత్తం 4500 ఆటోలు ఉన్నాయన్నారు.

దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన చెత్త నుండి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ) ప్లాంట్ జవహర్ నగర్లో జిహెచ్ఎంసి ద్వారా మొట్టమొదటగా 20మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మరో 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినందున మొత్తం 48మెగావాట్ల విద్యుత్తు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించడం, దక్షిణ భారతదేశంలో అతి పెద్దది కావడం విశేషమన్నారు.1350 స్వచ్ఛ ఆటోల వలన నగరంలో మూలమూలకు విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్యం మెరుగు పడుతుందని, కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కొరకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో బాగంగా ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారన్నారు. జిహెచ్ఎంసిలో తడి, పొడి చెత్త సేకరణ కొరకు ఆటోల పంపిణీ మంచి ఆలోచనలతో తీసుకున్న నిర్ణయమన్నారు. రెండోసారి 1350 ఆటోల పంపిణీ వలన హైదరాబాద్ నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ప్రియాంక అలా, ఖైరతాబాద్ జడ్.సి. రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, డి.సిలు, స్థానిక కార్పొరేటర్ లక్ష్మిబాల్ రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.