|

వైద్యరంగంలో నూతన విప్లవం

By: బి.సిద్ధార్థ్

దేశ వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. దేశ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన సందర్భం. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) దవాఖానలు ఆంధ్రపదేశ్‌ ఆవిర్భవించే నాటికే ఉన్నాయి. అంటే.. గత ప్రభుత్వాలు కలిసి 58 ఏండ్లలో ఏర్పాటు చేసినవి కేవలం మూడు మెడికల్‌ కాలేజీలే. కాకతీయ మెడికల్‌ కాలేజీని 1959లో ఏర్పాటు చేయగా, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో రిమ్స్‌, నిజామాబాద్‌లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

స్వరాష్ట్రంలో ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీలు.. – నవంబర్‌ 15 నుంచి మొదలైన తరగతులు
సొంత నిధులతోనే కాలేజీల ఏర్పాటు .. అదనంగా 1,150 మంది విద్యార్ధులకు వైద్య విద్య
ఏక కాలంలో ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ‘జిల్లాకో మెడికల్‌ కాలేజీ సాకారం దిశగా అడుగులు

ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు లేక, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స పొందాలన్నా.. మెరుగైన వైద్యం దొరకాలన్నా హైదరాబాద్‌ కు పరిగెత్తాల్సి వచ్చేది. వందల కిలోమీటర్లు, గంటల కొద్ది ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకొని, చికిత్స కోసం వారాలు, నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో కుటుంబాలు ఆగమయ్యేవి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. మరోవైపు.. వైద్య విద్య సైతం భారంగా మారింది. కేవలం ఐదే కాలేజీలు ఉండటంతో 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మెడిసిన్‌ చదువాలనుకున్న ఎంతో మంది విద్యార్థులు తమ కలలకు దూరం అయ్యేవారు. మరికొందరు మెడిసిన్‌ కోసం చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పిన్స్‌ వంటి దేశాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అష్టకష్టాలు పడ్డారు. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఈ కష్టాలను కళ్లారా చూశారు. స్వరాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు, వైద్య విద్యను తెలంగాణ విద్యార్థులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. మొదటి దశలో మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట్‌లలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డిలో కాలేజీలను ఏర్పాటు చేశారు. దీంతో కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. వచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ కల నెరవేరనున్నది.

కొత్త కాలేజీలతో రాష్ట్రంలో అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

  • 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790 కి పెరిగాయి.
  • పీజీ సీట్లు 531 నుండి 1122 కు పెరిగాయి.
  • సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152 కు పెరిగాయి.

కొత్త మెడికల్‌ కాలేజీలతో ప్రజలకు అనేక విధాలుగా లాభం కలుగనుంది.

నాణ్యమైన వైద్యం..

మెడికల్‌ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు కలుపుకొని, మొత్తం 35 వైద్య విభాగాలు సేవలందిస్తాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్స్‌ ఉంటాయి. వైద్యులు, 449 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 600 పైగా పారామెడికల్‌ సిబ్బంది ఉంటుంది. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్‌ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా సమీపంలోనే మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది.

డాక్టర్‌ కల సాకారం..

కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య ఎనిమిదేండ్లలోనే మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. డబ్బు ఖర్చు చేసుకొని విదేశాలకు వెళ్లే అవస్థ తప్పుతుంది. విదేశీ భాషల్లో ఎంబీబీఎస్‌ అభ్యసించే బాధలు తప్పనున్నాయి.

అభివృద్ధి విస్తరణ…

మెడికల్‌ కాలేజీ అంటే కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు. అనుబంధంగా అనేక వసతులు ఏర్పడతాయి. హాస్పిటల్‌ అందుబాటులోకి వస్తుంది. వీటిల్లో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. దీంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిటల్‌కు వచ్చే రోగులు, సహాయకులు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.