బియ్యం ఎగుమతికి ప్రోత్సాహం

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచింది. వరిధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి బియ్యంగా మార్చి, ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే 2 శాతం సిఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని సీఎం పునరుద్ఘాటించారు.

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సి- ఫారం దాఖలు చేస్తే (సిఎస్టీ) టాక్స్‌లో 2 శాతం రాయితీని కల్పించే విధానం ఉండేది. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభంలో అమలయ్యింది. కాగా 01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి- ఫారం పొందుపరచలేదనే కారణం చేత బియ్యం ఎగుమతి దారులకు సిఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ అమలుజరగలేదు.

కాగా… పన్ను రాయితీ అవకాశాన్ని కల్పించకపోవడం వలన తాము ఆర్థికంగా నష్ట పోతున్నామని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్‌ మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు. బియ్యం ఎగుమతి చేశామా లేదా అనేది నిర్దారణ చేసుకోవడమే సిఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎట్లా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. సిఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్దారణ చేసుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. తాము చేసిన లోడింగ్‌, రిలీజింగ్‌, సర్టిఫికేట్లు, లారీలు, రైల్వే పర్మిట్లు, వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్‌ నైనా తాము సబ్మిట్‌ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్నును రద్దు చేయాలని కోరారు.

ఇదే విషయాన్ని దామరచర్ల పర్యటన సందర్భంగా, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌ రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కలిసి తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం, ఇందులో కేవలం తెలంగాణ రైస్‌ మిల్లర్ల ప్రయోజనమే లేదని, దాంతో పాటు, తెలంగాణ రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి వున్నదనే విషయాన్ని గ్రహించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లవుతుందని సీఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ రైస్‌ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ను సీఎం ఆదేశించారు.

అటు రైస్‌ మిల్లర్లకు, ఇటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగే విధంగా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుణ్ణి సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసిన సందర్భంలో సిఫారం బదులు అందుకు సమానమైన లోడింగ్‌ సందర్భంగా ఇచ్చే సర్టిపికేట్లు కానీ, బియ్యం అన్‌ లోడ్‌ చేస్తున్న సందర్భంగా వుండే కాయితాలు, వే బిల్లులు, లారీలు, రైల్వేల ద్వారా చేసే రవాణా పర్మిట్లకు సంబంధించిన కాయితాలు, తదితర సంబంధిత పర్మిట్‌ సర్టిఫికెట్లు ఏవి వున్నా వాటిని పొందుపరిచి తాము ఎగుమతి చేసినట్టు నిర్దారించుకుంటే వాటిని సిఫారం ప్లేస్‌లో పరిగణనలోకి తీసుకోవచ్చునని, ఈ నేపథ్యంలో 01.04.2015 నుంచి 30.06.2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2 శాతం పన్నును రద్దు చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేసింది.

తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్‌ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సీఎంను ప్రగతి భవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.