హైదరాబాద్ నగరాభివృద్ధికి 5000 కోట్లు
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్నమాటలు, ఇపుడు భారీ మొత్తంగా నిధులను మంజూరు చేయడంతో వాస్తవ రూపం దాల్చే దిశగా ఆశలు చిగురించాయి. రాజధాని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.5,066.21 కోట్లు మంజూరు చేసింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో (MCHRD) పురపాలకశాఖ మంత్రి కే.తారక రామారావు, ఇందుకు సంబంధించిన జీవోలను విడుదలచేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడం కోసమే మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను మురుగులేని సుందరమైన,స్వచ్ఛ నగరంగా రూపొందించేం దుకు, ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా సీవరేజ్ ప్లాంట్లను నిర్మించ బోతున్నామని మంత్రి వివరించారు.దీని కోసం రూ.3,866.21 కోట్లను విడుదల చేసినట్టు ప్రకటించారు.
రాజధానిలో విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం వరకు తాగునీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు. ఇదంతా కూడా జలమండలి సమర్థమైన పనితీరు వల్లనే జరిగిందని అన్నారు. ఫలితంగానే హైదరాబాద్ నగరానికి వాటర్ ప్లస్ సిటీ హోదా దక్కిందని హర్షం వ్యక్తంచేశారు. ఇపుడు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూడా తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. 2019 నాటికే 70 మిలియన్ లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అయితే ఇందులో ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామాలకు, కాలనీల కు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం వీలుపడలేదని చెప్పారు. ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. 164 రిజర్వాయర్లను రూ.756.56 కోట్లతో అభివృద్ధి చేసి, 1,600 కిలోమీటర్ల పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇందుకోసం రూ.1,200 కోట్లను మంజూరుచేసిందని తెలిపారు. వచ్చే రెండేండ్లలో పనులన్నీ పూర్తిచేసి తాగునీటిని అందిస్తామని తెలిపారు.
జంటనగరాల్లో మురుగు నీటి సమస్య ఎక్కువగానే వుందని అన్నారు. నగరంలో యేరోజుకారోజు తయారవుతున్న మురుగునీటిని శుద్ధిచేసేందుకు ప్రణాళికలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతిరోజు 1,650 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, అందులో 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీలను (48.78%) మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నామన్నారు. దీన్ని వందశాతానికి చేర్చడంతోపాటు, 2036 నాటికి రోజూ ఉత్పత్తి అయ్యే మురుగునీరు 2,184 ఎంఎల్డీల మురుగునీటిని కూడా పరిగణనలోకి తీసుకొని, అందుకు అనుగుణంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ‘హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్’లో నిర్మించాలని ప్రతిపాదించామన్నారు.
గత రెండేండ్లుగా షా టెక్నాలజీస్ సంస్థతో నగరంలోని సీవరేజ్ సమస్యలపై అధ్యయనం చేయించామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఆ సంస్థ చేసిన సిఫారసు మేరకు వందశాతం మురుగునీటి శుద్ధికి 62 ఎస్టీపీలను నిర్మించాలని ప్రతిపాదించిం దన్నారు. అయితే తొలుతగా 31 ప్లాంట్ల నిర్మాణం కోసం రూ. 3,866.21 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా ఓఆర్ఆర్లో మరో 31 ఎస్టీపీలను నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. వీటన్నింటి నిర్మాణం కూడా మూడు ప్యాకేజీల్లో, హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్లో, నిర్మించడంతో పాటు, 15 యేండ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా కన్సల్టెన్సీయే చూసుకుంటుందన్నారు. ఇందులో నిర్మాణ సంస్థ 60 శాతం నిధులను, ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చిస్తుందని పేర్కొన్నారు.
మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం
మురుగునీటిని శుద్ధిచేయడం ద్వారా చెరువులు, కుంటల్లో కాలుష్యాన్ని తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చని మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం శుద్ధిచేస్తున్న మురుగునీటిలో 20 శాతం మాత్రమే మొక్కల పెంపకానికి, గార్డెనింగ్కి పునర్వినియోగిస్తున్నామని, వందశాతం శుద్ధి జరిగితే రోజుకు సుమారు 2 వేల ఎంఎల్డీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలా వస్తున్ననీటిద్వారా పలు నగరాలు ఆదాయాన్ని కూడా పొందుతున్నాయని తెలిపారు. అదేతరహాలో జీహెచ్ఎంసీ కూడా ఆదాయం పొందవచ్చన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని యోచిస్తున్నట్టు వెల్లడిరచారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ తదితర శాఖలతో కమిటీని వేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. మూసీ నదిని, నాలాలను ప్రక్షాళన చేయాలన్నదే సీఎం సంకల్పమని పేర్కొన్నారు. తాము కోరిన వెంటనే మురుగునీటి శుద్ధికోసం, శివారు గ్రామాల తాగునీటి కోసం ఒకేరోజు రూ.5 వేల కోట్ల నిధులను కేటాయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని వివరించారు. హైదరాబాద్ నగరానికి ఇంత భారీ ఎత్తున నిధులను సమకూర్చిన కేసీఆర్కు హైదరాబాద్ నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కంటోన్మెంట్ విలీనాన్ని ప్రజలే కోరుకొంటున్నారు
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేయాలని, అక్కడ నివసిస్తున్న అధికసంఖ్యాక ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్కడ రోడ్ల వెడల్పు మాటెలా ఉన్నా ఉన్న రోడ్లను కూడా మూసివేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ విలీనంపై అభిప్రాయం చెప్పాలని సోషల్ మీడియా వేదికగా నగరవాసులకు విజ్ఞప్తి చేస్తే.. 70 శాతం పైగా ప్రజలు విలీనాన్ని కోరుతున్నారని వెల్లడైందని తెలిపారు.
పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అభివృద్ధి పనులనూ అక్కడ చేపట్టలేక పోతున్నామని, కనీసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటిన్లను కూడా అక్కడ పెట్టలేని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. గతంలో కంటోన్మెంట్ ఏరియా నగరానికి దూరంగా ఉండేదని, ప్రస్తుతం నగరం మధ్యలోకి వచ్చిందని అన్నారు.

ఈ అంశానికి సంబంధించి మేయర్ గద్వాల విజయ లక్ష్మి స్పందిస్తూ.. హైదరాబాద్ అభివృద్ధికి ఎప్పుడు లేని విధంగా దాదాపు 6వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్ర పటానికి మేయర్ గద్వాల విజయ లక్ష్మి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ నగరానికి వచ్చే 15 ఏళ్ల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కావలసిన నిధులను మంజూరు చేశారని, అందుకు రాష్ట్ర మునిసిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నిధుల మంజూరుకు విశేష కృషి చేసిన నేపథ్యంలో వారికి మేయర్ ధన్యవాదాలు తెలియ జేశారు.
జిహెచ్ఎంసి చుట్టూ ప్రక్కల ఓఆర్ఆర్కు లోపలి భాగంలో నివసించే ప్రజల కోసం వచ్చే 10 పదేళ్లకు అవరమైన త్రాగు నీరు అందించేందుకు ప్రభుత్వం దూర దృష్టికి నిదర్శనమని ఈ సందర్భంగా మేయర్ అన్నారు.