గొర్రెల పంపిణీకి ఆరువేల కోట్లు

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు. తెలంగాణలో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6,000కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశిం చారు. దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతో పాటు యూనిట్‌ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు. అనుబంధ కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వసం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జీవన ముఖచిత్రం కుప్పకూలిపోయిన పరిస్థితి. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండ వర్గాల వృత్తి జీవనంలోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదు, వారికి ఆ సోయి కూడా లేదు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బీసీ వర్గాలను అల్లుకొనే తెలంగాణలో కుల వృత్తుల జీవనం కొనసాగింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి వుంటది. అవన్నీ కూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగు తాయి. ఉత్తర భారత దేశంలో మాదిరి కాకుండా వృత్తి కులాలన్నీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణకు ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను గుర్తించిన నూతన తెలంగాణ ప్రభుత్వం వారందరికీ అండగా నిలిచింది. మిషన్‌ కాకతీయ పథకం ప్రారంభంతో మొదలైన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం, సాగు నీరు వ్యవస్థలను మెరుగుపరిచింది. గ్రామానికి ఆదేరువుగా వున్న చెరువును నిత్య జలాలతో నింపి సజీవంగా వుంచి, ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది’’ అని సీఎం వివరించారు. తెలంగాణలో గొల్ల కురుమలు, యాదవుల కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్తలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధికోసం అమలు చేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సీఎం తెలిపారు. ‘‘వ్యవసాయం తరువాత పెద్ద ఎత్త్తున ఆధార పడిన కులవృత్తి చేనేత రంగం. ఒకనాడు బ్రాహ్మణులతో సమానంగా ప్రజల నుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి సమైక్య పాలనలో ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. వలస పాలకుల వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి, ప్రభుత్వ చిత్తశుద్ధితో, మంత్రి కేటీఆర్‌ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాల పాలైన చేనేత వృత్తి గాడిన పడుతున్నది. అదే సందర్భంలో కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు సహా, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన నడిపిస్తున్నది’’ అని సీఎం తెలిపారు.

గొర్రెల యూనిట్‌ పెంచిన ధరను రూ. 1,75,000గా సీఎం నిర్ణయించారు. ఇప్పటికే డీడీలు కట్టివున్న 14 వేల మంది అర్హులకు  కూడా పెంచిన ధరను వర్తింపచేయాలని సీఎం అధి కారులను ఆదేశించారు. రాజస్తాన్‌ను అధిగమించి, షీప్‌ పాపు లేషన్‌లో తెలంగాణ దేశంలో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్న దని సీఎం తెలిపారు. చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అని సీఎం అన్నారు. మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న దన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తెలంగాణలోని రిజర్వాయర్‌లు నిండి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్న దన్నారు. ప్రతీ గ్రామంలోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. గతంలో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణకు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు. సముద్ర ప్రాంతాలకు దూరంగా వున్న దేశంలోని పలు పట్టణాలు నగరాల్లో చేపల ఎగుమతి కోసం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల్లో చేపల ఉత్పత్తి ప్రక్రియను మత్స్యశాఖ పర్యవేక్షణలోనే వుంటుందన్నారు. చేపల పెంపకం సొసైటీలో 18 ఏండ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.

ఇతర కులాలకు అభివృద్ధి ఫలాలు:

అదే సందర్భంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మున్నూరుకాపులు సహా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వృత్తి కులాలకు కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన నడిపిస్తున్నది.’’ అని సీఎం తెలిపారు. బీసీ వృత్తి కులాల అభివృద్ధిపైన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

కె.సి.ఆర్‌. విధానాలతో ధనికులమయ్యాం

ఇప్పటిదాకా తాము ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, తమకు గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్‌ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం స్పష్టం చేసింది. గొల్ల కురుమల గురించి ఆలోచించి వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కేవలం కేసీఆర్‌ మాత్రమేనని, గత పాలనలో  పేదరికంలో మగ్గిన తెలంగాణ కురుమలు స్వయం పాలనలో ధనికులుగా మారారని, అందుకు సీఎం విధానాలే కారణమని తెలంగాణ కురుమ సంఘం తెలిపింది.

గొర్రెల యూనిట్‌ ధరను పెంచడమే కాకుండా, రూ. ఆరు వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను పంపిణీ చేస్తున్నందుకు ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, సంఘం నాయకులు కె. నర్సింహ, అరుణ్‌ కుమార్‌, నగేశ్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం. అదే మా సిద్ధాంతం. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి సంవత్సరమే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించినం. అప్పుడు ఏ ఎన్నికలున్నయి? మాది ఎన్నికల విధానం కాదు, తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే మా విధానం. తెలంగాణ సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగిస్తున్న పథకాలు ఎల్లకాలం కొనసాగేలా రూపొందించాము. తెలంగాణ రాకముందు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్నం కానీ ఇప్పుడు పల్లె పల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నయి’’  అని సీఎం స్పష్టం చేశారు. గొర్రెల పెంపకానికి గ్రామాల్లో షెడ్ల నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నామని సీఎం అన్నారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టామని సీఎం అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని, గొర్రెల పాపులేషన్‌లో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నదని సీఎం అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే వుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.