|

నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

శాసన సభా వేదికగా ప్రకటించిన సీ.ఎం. కే.సీ.ఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువులన్నీ ఒకే దఫా భర్తీచేస్తున్నట్టు ముఖ్యమంత్రి రాష్ట్ర శాసన సభ వేదికగా చేసిన ప్రకటన ఉద్యోగార్థులలో ఆనందోత్సాహాలను నింపింది. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే అంశాలే ప్రాధాన్యంగా ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు అవరోధాలను అధిగమించి నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శాఖల వారీగా, జోన్లవారీగా, జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగ వివరాలను ముఖ్యమంత్రి వివరిస్తూ, రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగాలను మానవతాదృష్టితో క్రమబద్ధీకరిస్తున్నామని, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలలో కొత్తవారిని నియమిస్తున్నట్టు సభ్యుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు.

జిల్లా స్థాయిలో 39,829, జోనల్‌ స్థాయిలో 18,866, బహుళజోనల్‌ లో 13,170, సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 8,174 పోస్టులు భర్తీచేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో తొలిసారిగా స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అటెండర్‌ నుంచి ఆర్డీఓ దాకా ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ప్రకటించారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్‌ పోస్టులకు, తమ జోన్‌ లోని జోనల్‌ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. ఉద్యోగార్థుల వయోపరిమితిని కూడా 10 సంవత్సరాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేయనున్న ఖాళీలలో అత్యధికం విద్య, హోమ్‌ (పోలీస్‌), వైద్యశాఖలకు చెందినవిగా ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలపై ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ శాసన సభలో సవివరంగా వివరించారు.

  1. తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం.
  2. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం. కేంద్రం అనవసర తాత్సారం చేసింది. దీంతో నేనే స్వయంగా అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి దీనికున్న ప్రాముఖ్యతను వివరించాను. దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. ఇది తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం.
  3. తెలంగాణా ప్రభుత్వం కృషి వల్ల, ఇకనుంచీ ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్‌ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్‌ దాకా అంటే అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్‌ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి గర్విస్తున్నాను.
  4. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్‌ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డిఎస్పీ, సిటివో, ఆర్‌.టి.వో., డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, ఎక్సైజ్‌ సూపరింటెం డెంట్‌ తదితర గ్రూప్‌ 1 ఉద్యోగాలకు లోకల్‌ రిజర్వేషన్‌ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్‌ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చాం.
  5. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే లోకల్‌ రిజర్వేషన్‌ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది.
  6. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్‌ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్‌ పోస్టులకు తమ జోన్‌ లోని జోనల్‌ క్యాడర్‌ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.
  7. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి.
  8. కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతోపాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వసంస్థలు మాత్రమేగాక ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధి లోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తుల, ఉద్యోగుల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే, ఈ ప్రక్రియకు కేంద్రప్రభుత్వ ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికితోడు కేంద్రం బాధ్యతారాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి, బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం.
  9. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం.
  10. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగటం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, మొత్తం 1,56,254 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించి, ఇప్పటివరకు 1,33,942 పోస్టులు భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
  11. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయ్యింది.
  12. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత.. ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబరులో ప్రభు త్వం పూర్తి చేసింది. దీంతో ప్రతీ జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాల పై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయటానికి మార్గం సుగమమైంది.
  13. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్‌ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు.
  14. యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలింది.
  15. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ఖజానా పై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.
  16. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి.
  17. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  18. పోలీస్‌ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుంది.