|

ఈ అభివృద్ధి మనకు గర్వకారణం

  • మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం

మహబూబ్‌నగర్‌ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్‌ రావుకు సీఎం అభినందనలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్‌ నిర్మాణంలో భాగస్వా ములైన ఇంజనీరింగ్‌ అధికారులను, సిబ్బందిని సీఎం సన్మానించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్‌ సిబ్బంది హాజరైన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చక్కటి పరిపాలన భవనాన్ని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకున్న ఉద్యోగులందరికి అభినందనలు తెలియజేశారు.

‘‘సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని, పోటీగాని ఎవరు లేరు. ఏడేండ్ల క్రితం కేవలం 60 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ ఉండే తెలంగాణ, ఈ రోజు రెండున్నర లక్షల కోట్ల పైన బడ్జెట్‌ పెట్టుకొని 2 లక్షల 10వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగింది. ఏడేండ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి కరెంట్‌ బాధలను అనుభవించిన తెలంగాణ ఈ రోజు దేశానికే తలమానికంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రంలేదు. ఈరోజు తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వపడుతున్న, సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని, పోటీగాని ఎవరు లేరు, అలాంటి ఆలోచనలు కూడ ఎవరికి రావు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనంతటికి కారణం మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకితభావంతో పని చేసినటువంటి ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల కృషి వల్లనేనని సీఎం అన్నారు. ఇంతటి గొప్ప అద్భుత ఆవిష్కరణలలో కృషి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు. నాడు పాలమూరు జిల్లా ఎండిపోయింది.. నేడు ధాన్యరాశులతో నిండిపోతున్నది… తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లాలో పర్యటించినప్పటి అనుభవాలు, జ్ఞాపకాల గురించి సీ.ఎం. మాట్లాడుతూ…

‘‘ఆ రోజుల్లో ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ గారు, నేను, మిత్రుడు లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్‌నగర్‌ వెళ్ళి వస్తావుంటే నవాపేట మండలంలో చిన్నపాటి అడవి ఉంటది. అమ్మవారి గుడి దగ్గర నేను జయశంకర్‌ గారు మాట్లాడుతూ లక్ష్మారెడ్డి అన్నాము. ‘‘ఏమండి లక్ష్మారెడ్డి గారు, డాక్టర్‌ గారు మీ జిల్లాలో చెట్లు కూడ బక్కగా అయిపోయాయని ఇదేం అన్యాయం అనిజెప్పి మాట్లాడుకుంటూ వచ్చాం’’ అనే సందర్భాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. తొలి నాళ్ళలో మాజీ ఎమ్మెల్యే, మాజీ సమితి ప్రెసిండెంట్‌, ఉత్తమమైన ప్రజా నాయకుడు కీ.శే. ఎడ్మ కృష్ణారెడ్డి వారి కొడుకు ఎడ్మ సత్యం అప్పుడు జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ జేస్తే నన్ను రమ్మని పిలిస్తే, నేను వరంగల్‌ నుండి చాలా దూరంలో ఉన్నాను కాబట్టి హెలికాప్టర్‌ లో వచ్చిన. వచ్చే క్రమంలో మొత్తం నల్లగొండ, దేవరకొండ, మునుగోడు కల్వకుర్తి మీదుగా వచ్చినం, కిందకు చూస్తే ఎక్కడ చూసిన ఎండిపోయిన ఎడారి ప్రాంతంలా కనబడిన నేలను చూసి కండ్లల్లో నీళ్ళు పెట్టుకుని బాధపడ్డం.’’

‘‘నేను అలంపూర్‌ జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేస్తే ఆరోజు కూడ అనేక అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలదరించే పరిస్థితి. నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి మిత్రుడు నిరంజన్‌ రెడ్డి, నేను అందరం కండ్లనీళ్ళు పెట్టుకున్నాము. మేము ఏడవడమే కాదు ఆ రోజు ఊరంతా ఏడ్చారు. అప్పటి వేదనలు, రోదనలు గుండె అవిశిపోయే బాధలుపడ్డ పాలమూరు జిల్లా, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కావాలని కోరుతున్నామో దేని కోసం అయితే పోరాటం చేసినమో అది ఆ బాట పట్టింది. ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించాలని ముందుకు పోతున్నం’’ అని సీఎం గతంలో తెలంగాణ పరిస్థితులను, ప్రస్థుత పరిస్థితులను పోల్చుతూ సాధిస్తున్న ప్రగతిని తెలియజెప్పారు.

సంతృప్తిని మించిన ఆస్తిలేదు

‘‘అనేక విషయాలు చాలా మందికి తెలియదు, ఎవ్వలం కూడా మనం వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదు, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకతను అటెండర్‌ పని చేయవచ్చు, ఒకాయన ఎమ్మార్వో కావొచ్చు, ఆర్డివో కావచ్చు, జాయింట్‌ కలెక్టర్‌ కావచ్చు, ఒకాయన చీఫ్‌ సెక్రటరీ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవి శాశ్వతం కాదు. ఎవరంకూడ అధికారంలో పొద్దాక ఉండం. ఒక స్టేజ్‌ తర్వాత 30 ఏండ్ల తర్వాత మీరు కూడ రిటైర్‌ కావాల్సిందే. కాని మనం ఉన్నప్పుడు ఏం చేసినం అన్నదే అంతిమంగా మనకు అద్భుతమైనటువంటి వేల, లక్షల కోట్ల ఆస్తికి సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. మేము ఉన్నప్పుడు ఇది చేసినం, మా వల్ల ఇది కాగలిగింది అన్నదే పెద్ద పెట్టుబడి. జీవితానికి చివరికి మిగిలి ఉండేది. గొప్ప సంతృప్తినిచ్చేది ఆ జాబ్‌ సాటిస్ఫాక్షన్‌ మాత్రమేనని’’ సీఎం అన్నారు.

పీవీ చూపిన మార్గం మన గురుకులాలకు ఆదర్శం

‘‘అనేకమంది మహనీయులు అనేక రకాల కృషి చేశారు. బాటలు వేసినారు, అనేక మార్గాలు మనం కూడ పట్టినం. పీవీ నరసింహారావు తెలంగాణ గడ్డలో పుట్టి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్లారు, వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజులలో రెసిడెన్షియల్‌ పాఠశాలలే అద్భుతమైనటువంటి ప్రగతికి దోహదం చేస్తాయని జెప్పి నల్లగొండ జిల్లాలో ‘సర్వేయల్‌’ అనే దగ్గర రెసిడెన్షియల్‌ పాఠశాలను వారు స్వయంగా చొరవ తీసుకుని పెట్టించారు. ఈ రోజు మన డీజీపీ మహేందర్‌ రెడ్డి కూడా రాష్ట్ర డిజిపి స్థాయికి ఎదిగారంటే అది ‘సర్వేయల్‌’ స్కూల్‌ యొక్క పుణ్యం. ఒక మంచి బాట, ఒక మార్గం, పీవీ గారి గురుకుల విద్య రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఆదర్శంగా తీసుకుని మనం కూడ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఒక వెయ్యి గురుకుల పాఠశాలలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నాం, ఈ వర్గం, ఆ వర్గం అనకుండా అందరికీ ఉపయోగపడే విధంగా స్థాపించుకున్నాం. గిరిజన, దళిత, మైనార్టీ సోదరులకు కావచ్చు, బిసి సోదరులకు కావచ్చు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా మరికొన్ని బిసి సోదరుల రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో ఈ మధ్య కొన్ని రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటుచేసుకున్నాం. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో పెంచాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరాలలో ఆ సంఖ్యను 3-4 రెట్లు పెంచుకుందాం’’అని సీఎం అన్నారు.

‘కంటి వెలుగు’ పథకం రూపకల్పన వెనుక

అట్లాగే కొన్ని విషయాలు మనందరం గమనించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘కంటి వెలుగు’ పథకం రూపకల్పనకు దారితీసిన విషయాన్ని సీఎం తెలియజేస్తూ ‘గజ్వేల్‌లోని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేద్దామంటే.. ఊరివాళ్లకు మంచి విశ్వాసం కల్పించాలనే మంచి ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. ఆ చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువతలేరని స్కూల్‌లో టీచర్లు, ఇండ్లల్లో తల్లిదండ్రులు కొడుతున్నరు. దీనిపై చాలా బాధపడి ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. వాస్తవానికి చెప్పకూడనిది ఏంటంటే, కంటి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందరికీ సరోజిని దవాఖాన ఒక్కటే. అంతకు మించి ఏమీ లేదు. అలాంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఆ తర్వాత చాలా కష్టపడి ‘కంటి వెలుగు’ కార్యక్రమం తీసుకువచ్చాం. అంతేకాని చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం తెచ్చింది కాదు అని సీఎం చెప్పారు. మళ్లీ రెండోదశ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని జిల్లా కలెక్టర్లు, అధికారులు విజయవంతం చేయాలని సీఎం కోరారు.

మానవీయ కోణంలో ‘‘కేసీఆర్‌ కిట్‌’’ పథకం

తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిందే ‘కేసీఆర్‌ కిట్‌’ అనే కార్యక్రమం అని సీఎం అన్నారు. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం ఉద్దేశం కాదు అని అన్నారు . టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మథనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయమని తెలిపారు.

పేదింటి ఆడబిడ్డలు గర్భం దాల్చిన తర్వాత కూడా ఉపాధి కోసం పని చేస్తూనే ఉంటారు. పని చేస్తే ఆ గర్భిణులకు, జన్మించే శిశువుకు మంచిది కాదు. ఎందుకు పని చేస్తున్నరనే విషయంపై అధ్యయనం చేశాం. ధనవంతులు వాళ్ల బిడ్డలకేమో ఇంట్లోని వాళ్లు సీమంతాలు వగైరా పండగలు చేస్తారు. ‘ఈమె నీళ్లుపోసుకున్నదయ్య, ఇప్పుడు కూసుండబెట్టి తిండిపెట్టాలే’.. ఇది పేదింట్లో వచ్చే మాట.. నేను కూడా పల్లెటూరులో పుట్టాను కాబట్టి.. నా చెవులతో విన్న కాబట్టి. ఎందుకంటే పేదరికం, దారిద్య్రం వల, అలాంటి పరిస్థితి ఉన్నది.

కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే, ఒకటి ఇనిస్టిట్యూషన్‌ డెలివరీలను ప్రోత్సహించాలి. మరొకటి మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతదో దాన్ని మనం ఇవ్వాలనేదే కేసీఆర్‌ కిట్‌ ఉద్దేశం అని సీఎం అన్నారు. అందుకోసం తీసుకున్న చర్యలలో భాగంగా ప్రభుత్వ అధికారి స్మితాసబర్వాల్‌తో పాటు మహిళా ఐఏఎస్‌ అధికారులను పలు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించామని. గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వాళ్లకు సంభవించే వేజ్‌ లాస్‌ను సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే భరించేలా కార్యక్రమాన్ని చేపట్టి, ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు పెరిగేలా అమ్మ ఒడి వాహనాలను తీసుకువచ్చాం. గర్భం దాల్చినప్పటి నుంచే సేవలు అందించడంతో పాటు మళ్లీ ప్రసవం అయిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ అందించి తల్లీ బిడ్డను ఇంటివద్ద దింపి రావడం వంటి సేవలను అందించడం భారతదేశంలో తెలంగాణలోనే ఇది సాధ్యమవుతు న్నది’ అని సీఎం అన్నారు.

సంఘటితంగా పని చేస్తే అద్భుతమైన ఫలితాలు

‘ఏరకమైన కార్యక్రమం తీసుకున్నా మానవీయ దృక్పథంతో.. ప్రజలకు మేలు జరగాలని. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేథోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని సీఎం అన్నారు. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేథోమథనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు. ఎప్పటిక ప్పుడు మేథోమథనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి సంఘటితం అయి పని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఏడేళ్ల కిందట మన బడ్జెట్‌ ఏందో తెలియదు, ఎకనామిక్‌ ట్రెండ్‌ ఏంటో తెలియదు. మనకు శాపాలు పెట్టిన వారున్నారు.. దీవెనలు పెట్టిన వారున్నారు. ఇప్పుడు మనముందున్నది అందరి సమష్టి కృషి ఫలితం అని సీఎం అన్నారు.

‘‘పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుందని. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రజలను కాపాడటానికి, ప్రజల పురోగమనానికి మనం ఉపయోగపడుతూ ముందుకు సాగాలి. ఈ ఎనిమిదేండ్ల ప్రస్థానంలో అందించిన సహకారం మీరు ఇకముందు కూడ అదేవిధంగా అందించాలి, మనం కలిసి ముందుకు పోదాం, మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసిన ఛీఫ్‌ సెక్రటరీకి, జిల్లా కలెక్టర్‌కి, జిల్లా యంత్రాంగానికి నూతన పరిపాలనభవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్న’’ అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

సమావేశంలో మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ ఎస్‌. వెంకట రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.