|

ప్రజా భద్రత భేష్‌

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మార్గదర్శనంలో హోం శాఖ ప్రజల భద్రతకు సంబంధించి విన్నూత్న కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా మొట్టమొదటి సారిగా అడిషనల్‌ డిజి స్థాయి సీనియర్‌ మహిళా పోలీస్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళా భద్రతా విభాగం పలు మాడ్యూల్‌లతో పనిచేస్తోంది. వీటిలో ప్రధానంగా ‘ షీ టీమ్స్‌’ ఏర్పాటు చేసింది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా మహిళల భద్రత విభాగం ఏర్పాటు చేయలేదు. భరోసా/లైంగిక నేరాల మాడ్యూల్‌, డొమస్టిక్‌ వాయిలెన్స్‌ (గృహహింస) డి.వి.మాడ్యూల్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగం ఏర్పాటు తదితర కార్యకలాపాలతో హోం శాఖ మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.

షీ టీమ్‌ లు కీలక పాత్ర……

గత సంవత్సరంలో (2022) మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలు పరిశీలిస్తే, బహిరంగ ప్రదేశాల్లో ఈవ్‌ టీజింగ్‌, వివిధ రకాల వేధింపులు, సోషల్‌ మీడియా వేధింపులు మొదలైనవాటిని అరికట్టేందుకు షీ టీంలు విస్తృతంగా పనిచేశాయి. దీనితోపాటు, బాధితులకు తక్షణ పోలీసు సహాయం అందించడంలోనూ షీ టీమ్‌లు కీలక పాత్ర వహించాయి. గత సంవత్సరంలో షీ టీమ్‌ లకు 6157 ఫిర్యాదులు అందాయి. అందులో 521 కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగింది. 1206 పెట్టీ (సాధారణ) కేసులు నమోదయ్యాయి. 1842 మందికి కూడా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కౌన్సిలింగ్‌ ఇచ్చిన వారిలో 1751 మంది మేజర్‌ లుకాగా, 90 మంది మైనర్‌ లకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ అందించారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు సైబర్‌ నేరాల పై అవగాహన కల్పించేందుకు విద్యా శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సైబర్‌ కాంగ్రెస్‌ శిక్షణా కార్యక్రమాన్ని కూడా షీ టీమ్‌ చేపట్టింది. దీనిలో భాగంగా గత ఆగస్టు 11న హైదరాబాద్‌ తోపాటు అన్ని జిల్లాల పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో ఏకకాలంలో సైబర్‌థాన్‌ గ్రాండ్‌ ఫినాలేను షీ టీమ్‌ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. సైబర్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2లో భాగంగా, రాష్ట్రంలో మరో 2381 ప్రభుత్వ పాఠశాలలను విద్యా శాఖతో, మహిళా భద్రతా విభాగం గుర్తించాయి. 2022-2023 సంవత్సరంలో ఎంపిక చేసిన పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఫిబ్రవరి 11, 2020న ప్రారంభించిన బాలికల సేఫ్టీ క్లబ్‌ లను 2022 సంవత్సరంలో మొత్తం 33 కళాశాలలలో ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలో సేఫ్టీ క్లబ్‌లను స్థాపించడానికి ప్రత్యేకంగా ఎస్‌ఓపిలను రూపొందించారు.

భరోసా సెంటర్ల ఏర్పాటు….

గత సంవత్సరంలో భరోసాసెంటర్లు డీల్‌ చేసిన కేసుల్లో 23 మందిని దోషులుగా నిర్ధారించారు. హైదరాబాద్‌, వికారాబాద్‌, వరంగల్‌, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేటలో భరోసా కేంద్రాలతోపాటు ఈ ఏడాది మరో 5 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌, జోగులాంబగద్వాల్‌, మెదక్‌ జిల్లాల్లో భరోసా కేంద్రాల తోపాటు మరో 12 జిల్లాలలో భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రత్యేక లైంగిక నేరాల కింద మొత్తం 91 కేసులు నమోదు చేశారు. వీటిని భరోసా ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

లైంగిక నేరాల ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఐటిటిఎస్‌ఓ) ఏర్పాట్లు….

రేప్‌/పోక్సో కేసులను 2 నెలల్లో దర్యాప్తును పూర్తి చేయడానికి ఉద్దేశించి ప్రత్యేకంగా లైంగిక నేరాలకు సంబంధించిన దర్యాప్తు ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఐటిటిఎస్‌ఓ) ఏర్పాటు చేశారు. రేప్‌/పోక్సో కేసులకు చెందిన కేసులకు సంబంధించి గత సెప్టెంబర్‌ వరకు 84 శాతం కేసులకు 2 నెలల్లోపు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడం జరిగింది. రెండు నెలల తప్పనిసరి వ్యవధిలో లైంగిక నేరాలకు సంబంధించి కేవలం రెండు నెలలవ్యవధిలోనే పరిష్కారంలో తెలంగాణా పోలీస్‌ శాఖ చేసిన కృషిని తిరువనంతపురంలో జరిగిన సౌత్‌ జోనల్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభినందించింది.

గృహ హింస మాడ్యూల్‌:

గత సంవత్సరంలో 276 పిటిషన్లు గృహహింస విభాగం మాడ్యూల్‌కు అందాయి, వాటిలో 174 పిటిషన్లు నేరుగా అందాయి, మిగిలిన 102 పిటిషన్‌లను షీ టీమ్స్‌ వాట్సాప్‌ ద్వారా స్వీకరించారు. రాష్ట్రంలోని 250 పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్‌ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది. మొత్తం 2,208 మంది శిక్షణపొందిన పోలీసు అధికారులను ఈ హెల్ప్‌ డెస్క్‌ లో నియమించారు.

ధైర్య యాప్‌ :

గృహ హింస బాధితులకు భద్రత, భరోసా కల్పించేందుకు ధైర్య అనే యాప్‌ ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనిని డయల్‌ 100, అన్ని మహిళా పోలీసు స్టేషన్లు, మహిళా భద్రతా విభాగానికి అనుసంధానం చేశారు. ఈ యాప్‌ ద్వారా మొత్తం 48,685 కాల్‌లు అందగా వాటిని వెంటనే అటెండ్‌ చేశారు.

ఎన్‌ఆర్‌ఐ మాడ్యూల్‌:

గత సంవత్సరంలో ప్రవాస భారతీయులు చేసిన మోసాలపై 85 పిటిషన్లు అందాయి. ఎన్‌ఆర్‌ఐ బాధితుల పిటీషన్ల సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన చర్యలు చేపట్టడం జరిగింది.

సైబర్‌ మాడ్యూల్‌ & అనాలిసిస్‌ మాడ్యూల్‌:

సైబర్‌ క్రైమ్‌లకు సంబంధించి 76 పిటిషన్‌లను సైబర్‌ మాడ్యూల్‌ స్వీకరించింది. వీటిలో 36 పిటిషన్లు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయబడ్డాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లలో 29 మంది నిందితులను గుర్తించగా వీరిలో 19 మంది నిందితులను అరెస్టు చేశారు. 200 మంది బాలికలతో చాటింగ్‌ (కమ్యూనికేట్‌) చేస్తూ మైనర్‌ బాలికలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఒక నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది. మహిళా భద్రతా విభాగంలోని షీ సైబర్‌ ల్యాబ్‌లో ఉన్న అధునాతన మొబైల్‌ ఫోరెన్సిక్‌ సాధనాన్ని ఉపయోగించి తప్పియిపోయిన 4 గురు మైనర్‌ బాలికలను బెంగుళూరు, ముంబైలలో కనుగొనగా, ఒక అబ్బాయిని తిరుపతిలో కనుగొన్నారు.

సైబర్‌ పెట్రోలింగ్‌:

నేర పరిశోధన, సీన్‌ అఫ్‌ అఫెన్స్‌ నిర్వహించడానికి అత్యంత ఆధునిక సామర్థ్యం కలిగి ఉన్న ఫోరెన్సిక్‌ పరికరాలు షీ సైబర్‌ ల్యాబ్‌ లోఉన్నాయి. ఈ అత్యుత్తమ సాంకేతిక పరికరాలను ఉపయోగించి షీ సైబర్‌ ల్యాబ్‌ బృందం ఉత్తమ ఫలితాలను సాధించింది. వీటి సహాయంతో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ (సిఎస్‌ఎఎమ్‌)కి సంబంధించిన 58 మూలలను, ఆన్‌లైన్‌ వ్యభిచారానికి సంబంధించిన 12 లింకులను గుర్తించడం తోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటికి సంబంధించి 11 మంది నిందితులను అరెస్టు చేశారు. న్యూఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన ఇతర రాష్ట్రాలకు ఈ 22 లీడ్‌ లను అందించారు. ప్రో-యాక్టివ్‌ ఇంటెలిజెన్స్‌ లో భాగంగా, 2022 సంవత్సరంలో షీ టీమ్‌ సంబంధిత 3011 కేసులకు చెందిన 3145 మందిని, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కు సంబంధించిన 291 కేసులలో 894 మంది నేరస్థులను, సైబర్‌ సంబంధిత 454 కేసుల్లో 408 మంది నేరస్థులను విశ్లేషించడం జరిగింది. వీరిలో మహిళలు, పిల్లలపై నేరాలను నిరంతరం పాల్పడే 53 మంది నేరస్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా సోషల్‌ మీడియా ప్రొఫైల్‌లను రూపొందించి ముందు జాగ్రత్తలు తీసుకుందుకై సర్కులేట్‌ చేయడం జరిగింది.

అవార్డులు…. రివార్డులు :

రాష్ట్ర హోం శాఖ చేపట్టిన భద్రత చర్యలకు సంబంధించి పలు రివార్డులు, అవార్డులు పొందటం జరిగింది. ఎఫ్‌ఐసిసిఐ స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డ్‌-2021 భాగంగా ‘‘చైల్డ్‌ సేఫ్టీ’’ విభాగంలో షీ సైబర్‌ ల్యాబ్‌ (విశ్లేషణ బృందం)కు ఎఫ్‌ఐసిసిఐ స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డు-2021 ప్రతిష్ఠాత్మకమైన స్పెషల్‌ జ్యూరీ అవార్డును అందుకుంది.

అవగాహన, శిక్షణ కార్యక్రమాలు.

వివిధ కేస్‌ స్టడీస్‌ ల విశ్లేషణలద్వారా సైబర్‌ నేరాలలో తాజా ధోరణులపై చైతన్య పర్చేందుకై జిల్లా పోలీసు అధికారులు, సైబర్‌ వారియర్స్‌, పౌరులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్‌లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి: మేము దానిని సురక్షిత పరుస్తాం’ అనే అంశంపై నెల రోజుల సైబర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్‌ షీ టీమ్స్‌, ఎహెచ్‌టియు బృందాలతో కలిసి, సుమారు 1500 మందికి అవగాహన కల్పించారు. సోషల్‌ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ‘‘పోలీసింగ్‌లో అత్యుత్తమ సాంకేతికతలు’’ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి ఐపిఎస్‌ అధికారులు, ట్రైనీలు హాజరైన శిక్షణా కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌, మహిళా భద్రతా విభాగం చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలిపే ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

హైదరాబాదులోని ఆర్‌బివిఆర్‌ఆర్‌టిఎస్‌పిఎలో ఆన్‌లైన్‌ ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడంపై సాంకేతికతపై రాష్ట్ర స్థాయి శిక్షణలు నిర్వహించారు. 2022 సెప్టెంబర్‌ 6న ఆర్‌బివిఆర్‌ఆర్‌టిఎస్‌పిఎ వద్ద ఫోరెన్సిక్‌ విశ్లేషణపై ఒడిశా రాష్ట్ర ప్రొబేషనరీ డిప్యూటీ ఎస్‌ఎస్‌.పి.లకు శిక్షణ ఇచ్చారు. 2022 ఫిబ్రవరి 02న తెలంగాణలోని ఎస్‌ఐ స్థాయి నుండి డిప్యూటీ ఎస్‌పిల స్థాయి పోలీసు అధికారులకు మహిళలు, పిల్లలపై జరిగే సైబర్‌ క్రైమ్‌పై డబ్ల్యుఎస్‌డబ్ల్యులో శిక్షణ ఇవ్వబడింది. 2022 సెప్టెంబర్‌ 16న ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ యొక్క సాంకేతిక కార్యక్రమాలపై ఉపాధ్యాయులు, ఇతర వివిధ విభాగాలకు శిక్షణ ఇవ్వబడింది. సెప్టెంబర్‌ 29, 30 తేదీలలో మహిళలు మరియు పిల్లలపై సైబర్‌ సంబంధిత కేసులను డీల్‌ చేయడం కోసం రాష్ట్ర షీ టీమ్‌ పోలీసు సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణను నిర్వహించింది. సంవత్సరం పొడవునా సైబ్‌హర్‌`3 కాంగ్రెస్‌ ఆన్‌లైన్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి ఎంఎస్‌డబ్ల్యు సాంకేతిక మద్దతు అందించడం జరిగింది. క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సిడెంట్‌ హ్యాండ్లింగ్‌ను నిర్వహించడానికి అత్యుత్తమ ఫోరెన్సిక్‌ సాధనాలు, సామర్థ్యాలను మహిళా భద్రతా విభాగం కలిగి ఉంది.

ఎహెచ్‌టి మాడ్యూల్‌ :

తెలంగాణ రాష్ట్రంలో 30 యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు (ఎహెచ్‌టియు) డబ్ల్యుఎస్‌డబ్ల్యు పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 342 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 645 మంది బాధితులను రక్షించడంతోపాటు 491 మంది ట్రాఫికర్లను అరెస్టు చేయడం జరిగింది.. 5 గురు మానవ అక్రమ రవాణా నేరస్థులను డబ్ల్యుఎస్‌డబ్ల్యు యొక్క ఎహెచ్‌టి గుర్తించింది. డబ్ల్యుఎస్‌డబ్ల్యు యొక్క సైబర్‌ ల్యాబ్‌ సహాయంతో హైదరాబాద్‌ పరిధిలోని శాలిబండ, అంబర్‌పేట్‌లోని 2 ఎహెచ్‌టియు కేసులలో ఆరుగురిని, పశ్చిమ బెంగాల్‌లోని ఫలకాటాలో ఒక ట్రాఫికర్లను అరెస్టు చేశారు. 4 మంది బాధితులను రక్షించారు. రాచకొండ (34), సైబరాబాద్‌ (03) కమిషనరేట్‌లలో పీడీ యాక్ట్‌ కేసుల్లో 37 మంది ట్రాఫికర్లను అరెస్టు చేశారు.బాల్య వివాహాలు, పారిపోవడం, అక్రమ రవాణా, బాల కార్మికులు మొదలైన వాటిపై ఎహెచ్‌టియులు 2252 అవగాహన ప్రచారాలను నిర్వహించాయి. బాల్య వివాహాలు, పారిపోవడం, బాలల తప్పిపోవడం, బాండెడ్‌/బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, సైబర్‌ నేరాలు, బాలల లైంగిక వేధింపులు మొదలైన వాటిపై 10 రోజుల చైతన్య, అవగాహనా ప్రచారం జరిగింది. ఇందులో 3,00,000 మందికి పైగా పాల్గొన్నారు.

ఆపరేషన్స్‌ స్మైల్‌ & ముస్కాన్‌ :

భారత హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ), భారత ప్రభుత్వ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌, మార్గదర్శకాల ప్రకారం, జనవరి-22 , జూలై-22 నెలల్లో ఆపరేషన్‌ స్మైల్‌-8, ఆపరేషన్‌ ముస్కాన్‌-8 చేపట్టబడ్డాయి. ఆపరేషన్‌ ముస్కాన్‌-8 కార్యక్రమాల్లో మొత్తం 6228 పిల్లలను రక్షించి, 5287 మందిని వారి తల్లి తండ్రుల వద్దకు చేరవేశారు. మరో 941 మంది పిల్లలను షెల్టర్‌ హోమ్‌లకు పంపగా, 838 ఎఫ్‌.ఐ.ఆర్‌ లను నమోదు చేయడం జరిగింది. ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, ట్రన్స్‌ జెండర్‌ల హక్కులను పరిరక్షించడానికి, పోలీస్‌ స్టేషన్‌లలో సౌకర్యాల కల్పనకై 2022 ఏప్రిల్‌ 12న తెలంగాణ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను ‘ప్రైడ్‌ ప్లేస్‌’ గా ఏర్పాటు చేశారు. 2022 జూన్‌ 24న మహిళా భద్రతా విభాగం ‘‘ప్రైడ్‌ మంత్‌’’గా సెన్సిటైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది.

భారత హోం మంత్రిత్వ శాఖ, మార్గదర్శకాల అనుసరించి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాదారుల సహకారంతో ఇటీవలే నెలరోజుల పాటు ఆపరేషన్‌ స్మైల్‌ మరియు ముస్కాన్‌ కార్యక్రమాలలో భాగంగా తప్పిపోయిన/కిడ్నాప్‌ చేయబడిన పిల్లలను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి రాష్ట్ర హోం శాఖ చర్యలు చేపట్టింది.