రాష్ట్రంలో మూడు జూట్ మిల్లులు
పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలు
రూ. 887 కోట్ల పెట్టుబడులు.. 10వేల మందికి ఉపాధి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోస్టర్, కాళేశ్వరం ఆగ్రోటెక్, ఎంజీబీ కమోడిటీస్ మూడు జూట్ మిల్లులు ముందుకు వచ్చాయి. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఆయా కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్, సిరిసిల్ల లలో ఈ మిల్లులను స్థాపించనున్నారు. వరంగల్లో రూ.330 కోట్లతో గ్లోస్టర్, కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రోటెక్ రూ.254 కోట్లతో, సిరిసిల్లలో ఎంబీజీ కమోడిటీస్ రూ.303 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ జూట్ మిల్లులు ఏర్పాటుచేస్తామని చెప్పారు.

మిల్లులు స్థాపించిన పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలను కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మిల్లులకు జనుము సరఫరా చేసేందుకు గాను 10 లక్షల ఎకరాల్లో జనుము పంట పండిరచడానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు పశ్చిమబెంగాల్ నుంచి జనుము దిగుమతి చేసుకోవడానికి మొదటి 5 సంవత్సరాలు రవాణా రాయితీ ఇస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో జనుము పంటను ప్రోత్సహించడంతో పాటు, జూట్ మిల్లులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా సంచులను తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కనీసం పది లక్షల ఎకరాల్లో జనుము పంట వేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వరి సాగు వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఉండదని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ మిల్లుల స్థాపనతో 10,400 నిరుద్యోగులకు, కార్మికులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం జూట్ బ్యాగులేనని చెప్పారు. గతంలో రాష్ట్రంలో కేవలం 20 లక్షల టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడది కోటి టన్నులకు చేరిందని గుర్తుచేశారు. ధాన్యానికి తగిన విధంగా గోనె సంచులు ఉత్పత్తి చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలన్నారు.ఈ జూట్ మిల్లులు రైతుల నుంచి జనుము ను నేరుగా కొనుగోలు చేస్తాయన్నారు. రాష్ట్రప్రభుత్వం, కంపెనీలు రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. వీటిద్వారా జూట్ ఉత్పత్తులకు మరింత డిమాండ్ వస్తుందని తెలిపారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అద్భుతమైన మానవవనరులు, ముడిసరుకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల మాట్లాడుతూ 2014 వరకు తెలంగాణలో 3.2 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా, పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తితో వాటి డిమాండ్ 2021-22లో 50 కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పుడు ఏర్పాటుచేసే మూడు మిల్లుల్లో తయారయ్యే సంచులు కూడా మన అవసరాలకు సరిపోనంతగా పంట పండుతున్నదని వెల్లడిరచారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఇక్కడి వ్యవసాయ అనుకూల వాతావరణం చూసి పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించినట్టు గ్లోస్టర్ కంపెనీ ఛైర్మన్ హేమంత్ బాగూర్ చెప్పారు. ఈ మిల్లుల ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, కంపెనీల ప్రతినిధులు హేమంత్ బాగూర్, విజయ్ మదాని తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో జూట్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి గాను ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఆ వివరాలు.
- ఈ మిల్లుల్లో తయారయ్యే గోనె సంచులను మొదటి ఏడేండ్లు వందశాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
- ఆ తరువాత ఐదేండ్లపాటు 75 శాతం సంచులను, ఆ తరువాత 8 ఏండ్లపాటు 50 శాతం సంచులను ప్రభుత్వం కొంటుంది.
- మొదటి ఐదేండ్లు ఈ మిల్లుల్లో గోనె సంచుల తయారీకి అవసరమైన జనుమును పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవడానికి ప్రభుత్వం రవాణా రాయితీ ఇస్తుంది.
- మొదటి రెండేండ్లు రవాణాపై రాయితీని 75 శాతం, మూడు, నాలుగేండ్లలో 50 శాతం, ఐదో ఏడాది 25 శాతం చెల్లిస్తుంది.
- మూలధన వ్యయం, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, విద్యుత్తు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.- వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఈ పరిశ్రమలకు అవసరమైన జనుము పంట వేసేలా చర్యలు తీసుకొంటుంది.