గజ్వేల్కు రైలొస్తోంది
By: శ్రీ మామిడాల రామాచారి
- మనోహరబాద్ టూ కొడకండ్ల వరకూ నిర్మాణం పూర్తి
- సిద్ధిపేట రైల్వే స్టేషను శంకుస్థాపనకై సన్నాహాలు
- రైల్వే స్టేషన్లు, సదుపాయాలు పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్
సిద్ధిపేట జిల్లా వాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరుతున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైలు మార్గంలోని తొలి దశ పూర్తయ్యింది. మనోహరాబాద్-గజ్వేల్-కొడకండ్ల మార్గంలో 42.6 కిలోమీటర్ల మేర అన్ని పనులు పూర్తవగా, ఇప్పటికే మనోహరాబాద్-గజ్వేల్ మధ్య 33 కిలోమీటర్ల మేర జరిపిన ట్రయల్ రన్ విజయవంతమైంది.

మనోహరాబాద్-గజ్వేల్ నూతన రైల్వే మార్గంలో త్వరలోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి. తాజాగా గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 9.6 కిలోమీటర్ల రైల్వేలైన్ను రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. గజ్వేల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన సిగ్నల్స్ కంట్రోలింగ్ వ్యవస్థ, మౌలిక వసతులు, రైల్వేట్రాక్, స్టేషన్ల నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ రైల్వేస్టేషన్లో పూజలు జరిపి, కొడకండ్ల వరకు ట్రాలీలో వెళ్లారు. ఆ తర్వాత ఈ మార్గంలో రైలును వేగంగా నడిపించి పరిశీలనలు చేసి రైల్వే మార్గం పటిష్టంగా ఉన్నట్టు నిర్థారించారు.

ఉదయం 11గంటలకు ప్రారంభమైన రైల్వే సేఫ్టీ తనిఖీలు సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగాయి. పరిశీలన పూర్తయిన తర్వాత మనోహరాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లారు. ఈ పరిశీలనలో సేఫ్టీ కమిషనర్ అభయ్కుమార్ రాయ్తో పాటు డీఆర్ఎం శరత్చంద్ర, డిప్యుటీ చీఫ్ ఇంజినీర్ సహధర్మ దేవరాయ, చీఫ్ ఇంజినీర్ కలబందే, చీఫ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
సిద్ధిపేట రైల్వే స్టేషనుకు త్వరలోనే శంకుస్థాపన
మనోహరాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం, రాయపోల్ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్ పట్టణం వరకు మూడు స్టేషన్లతో పాటు రైల్వేట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. లకుడారం, దుద్దెడ, సిద్ధిపేట స్టేషన్ల ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గజ్వేల్ రైల్వే స్టేషన్లో మొత్తం 5 లైన్లుగా రైల్వే పట్టాలను వేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైనులో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు. రెండవ దశ పనుల్లో గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు 32 కిలోమీటర్ల నిర్మాణం ఉండనున్నది. ప్రస్తుతం పట్టాల బిగింపు, లైన్ నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.

సిద్ధిపేట శివారులో నిర్మించనున్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నాలుగు జిల్లాలు, 70 గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా సాగే ఈ రైల్వేలైన్ మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు. సికింద్రాబాద్-మన్మాడ్ వెళ్లే మార్గంలో మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై, సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజామాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద కలువనున్నది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కోల్కతా, న్యూఢల్లీి, ముంబై తదితర మహా నగరాలకు ఈ ప్రాంతంతో రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. భవిష్యత్తులో గజ్వేల్, సిద్ధిపేట రైల్వేస్టేషన్లు కేంద్ర బిందువులుగా మారనున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న దరిమిలా 50 కిలో మీటర్ల దూరంలోని గజ్వేల్ రైల్వేస్టేషన్పై అధికారులు దృష్టి సారించారు. ఢల్లీి, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచి రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారిక వర్గాల ద్వారా తెలుస్తున్నది.
మనోహరబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ విశేషాలు
రైలు మార్గంలో ఉన్న జిల్లాలు సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్
రైలు మార్గంలో ఉన్న గ్రామాలు 70
రైలు మార్గంలో మొత్తం రైల్వే స్టేషన్లు 15
రైలు మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలు
వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయాలు.
మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు
మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు
సిద్ధిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు
రాజన్న సిరిసిల్లా జిల్లాలో 37.80 కిలోమీటర్లు
కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు
పూర్తిస్థాయిలో పూర్తయిన మార్గం
42.6 కిలోమీటర్లు
రెండవ దశలోని గజ్వేల్ టూ దుద్దెడ
32 కిలోమీటర్లు