|

సంస్కరణల బాటలో రెండేళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ళలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనా సంస్కరణలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు జరిగి, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికార పగ్గాలు చేపట్టాక ఆయన అభివృద్ధి, సంక్షేమంపై ఎక్కువ శ్రద్ధ వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేయడం, మిషన్‌ భరీరథ అనే బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు న భూతో న భవిష్యతి అన్న రీతిలో అమలు జరిపారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా, రెండు పడకగదుల ఇళ్ళు తదితర అభివృద్ధి, సంక్షేమంపై నిధుల వరద పారించారు. ప్రజల ముంగిటికే పాలన తీసుకుపోవడమే ధ్యేయంగా పరిపాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేశారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడమే కాకుండా, పలు మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. చాలా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్పోరేషన్ల సంఖ్యను పెంచి కొత్తగా బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు. వీటితో మొత్తం 13 కార్పోరేషన్లు అయ్యాయి. ఇక కొత్తగా 76 మున్సిపాలిటీల ఏర్పాటు చేయడంతో పాతవి 52తో కలిపి మొత్తం 128 మొత్తం మున్సిపాలిటీలు అయ్యాయి. ఇదే కాకుండా గ్రామ పాలన వీకేంద్రీకరిస్తూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు.

2018లో తిరిగి అధికారం చేపట్టాక పాలనా సంస్కరణలు ముఖ్యమైన అంశంగా తీసుకున్నారు. ముఖ్యంగా రెవిన్యూ శాఖపై పూర్తి దృష్టి కేంద్రీకరించారు. గ్రామస్థాయిలో విఏఓల వల్ల జరుగుతున్న అవినీతి, అక్రమ వ్యవహారాలు తెలుసుకుని ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. మున్సిపల్‌, రెవిన్యూ శాఖలకు సంబంధించి అవినీతిపై వేటువేశారు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్లకు ప్రజల నుంచి లంచాల రూపంలో అధికారులు డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని తెలుసుకున్నారు. దీనికి ఎలాగైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావించారు. అందులో భాగంగానే ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాన్ని తహసిల్‌దార్లకే అప్పగించారు. అరగంట లోపే రిజిస్ట్రేషన్‌ జరిగిపోవడం, పట్టా చేయడం, పాసు పుస్తకాన్ని చేతికి ఇవ్వడం చేస్తున్నారు. దీనితో ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలలు, సంవత్సరాలు గడచినా పట్టా కావడం దుర్లభంగా ఉండేది. అది సులభతరం అయిపోయింది. ఇక మున్సిపల్‌ పాలనలో కూడా మార్పులు తెచ్చారు. భవనాలు, అపార్టుమెంట్‌ల నిర్మాణం కోసం త్వరితగతిన అనుమతులు వచ్చే విధంగా టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశ్రమల అనుమతుల కోసం ఏక గవాక్ష విధానం ప్రవేశపెట్టి పారిశ్రామిక వేత్తలు పలు శాఖలకు తిరగకుండా ఒకేచోట అనుమతులు ఇచ్చే విధంగా విధానాన్ని రూపొందించారు. విద్యాశాఖలో గురు కులాలు ఏర్పాటు చేశారు.

తాను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి వృద్ధులు, వితంతువులకు ఇచ్చే నెలకు వెయ్యి రూపాయల పింఛన్‌ను, రూ. 2016 పెంచారు. వికలాంగుల పింఛన్‌ను 1500 రూపాయల నుంచి 3వేల 16కు పెంచారు. గత ఏడాది మే నుంచి 39.35 లక్షల మందికి పెంచిన పెన్షన్‌ అందిస్తున్నారు. కొత్తగా 8.5 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను తొలిగించారు. ఇంట్లో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద దివ్యాంగ వధువులకు సాయం రూ.1.25 లక్షలకు పెంచారు. బాల్య వివాహాలు తగ్గిపోయాయి. దివ్యాంగులకు 5 శాతం అదనపు రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. నీరా పాలసీ తెచ్చారు.

ఇదేకాకుండా పిడుగులా ప్రజలపై పడ్డ కరోనా కష్టాన్ని కూడా ఎంతో పెద్ద మనసుతో గుర్తించిన కేసీఆర్‌ వలస కార్మికులకు అండదండగా నిలిచారు. కరోనా రోగులకు సకల సౌకర్యాలను కల్పించి వారు ఆరోగ్యవంతులుగా తిరిగి కోలుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుకే మన రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా కష్ట కాలంలో పేదలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తినడానికి తిండి కూడా లేని దీన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భంలో నేనున్నానంటూ తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి కడుపు నింపింది. నాలుగు నెలలపాటు ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా రేషన్‌ బియ్యం సరఫరా చేసింది. ఆ తర్వాత మరో మూడు నెలలపాటు 2 కిలోల చొప్పున కందిపప్పు, నాలుగు నెలలపాటు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. ఆర్థికంగా కూడా అండగా నిలిచింది. ఏప్రిల్‌, మే నెలల్లో ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున ఆర్థికసాయం కూడా అందజేసింది. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా కూడా సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు రానివ్వలేదు.
ఇలా ఈ రెండు సంవత్సరాలలో గత టర్మ్‌లో చేసిన అభివృద్ధి, సంక్షేమ, సంస్కరణలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభిమాన్ని చూరగొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. శాఖల వారీగా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమాన్ని ఒక సారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నదనడంలో అతి శయోక్తి లేదు.

రూపురేఖలు మారిన పురపాలన
ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టాన్ని 2019లో తీసుకొచ్చింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలు మార్చడమే కాకుండా పురసేవల లభ్యతను మరింత బాధ్యతాయుతంగా అందించేలా ఈ చట్టం రూపుదిద్దుకున్నది. బడ్జెట్‌లో 10 శాతాన్ని గ్రీన్‌బడ్జెట్‌గా తేవడమే కాకుండా అన్ని పట్టణాలు, నగరాలు ఆకుపచ్చని శోభను సంతరించుకోవాలని చట్టం స్పష్టంచేసింది. నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలు పాలనలో భాగస్వామ్యం కావాలని కొత్త చట్టం పేర్కొన్నది. జవాబుదారీతనాన్ని పెంచింది. పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛపట్టణ నిర్మాణానికి ఊతమిచ్చింది. మరోవైపు అధికారులు దశాబ్దాల తరబడి ఒకేచోట తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానానికి స్వస్తిపలికింది.

టీఎస్‌బీపాస్‌: దేశంలో ఎక్కడాలేనివిధంగా భవన నిర్మాణం, లేఅవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌బీపాస్‌ (తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధానం)ను ప్రవేశపెట్టి గృహ నిర్మాణ అనుమతుల్లో అద్భుతమైన సంస్కరణను తీసు కొచ్చింది. 75 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్‌లో నిర్మించే భవనం ఎత్తు 7 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోనే అనుమతి పత్రం జారీ అవుతున్నది. ఇది లక్షల మంది గృహ నిర్మాణదారులకు ఊరట కల్పించింది. పట్టణ పరిశుభ్రతలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమం 24 ఫిబ్రవరి 2020 నుంచి 10 రోజుల పాటు జరిగింది. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా తీర్చిదిద్ద బడ్డాయి.

రెవెన్యూ సత్వర సేవలు
సంక్లిష్టంగా ఉన్న రెవెన్యూ చట్టాన్ని సరళతరం చేస్తూ అద్భుతమైన నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌ 22న గెజిట్‌ జారీ అయ్యింది. నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రూపొందిన ధరణి పోర్టల్‌ను అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ ప్రా రంభించారు. అప్పటి నుంచి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. అరగంటలోపే రిజిస్ట్రేషన్‌, పట్టామార్పిడి జరిగిపోయే విధంగా దీన్ని రూపొందించారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక అధికారులకు ఉన్న విచక్షణాధికారాలను తొలగిస్తూ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో ముందడుగు వేసింది. రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేచోట జరిగేలా పంచాయతీ, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ చట్టాల్లో సవరణలు చేసింది. లావాదేవీల సమయంలో క్రయ, విక్రయదారుల కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తూ, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌, అటవీ భూముల వివరాలన్నీ ధరణిలో అప్‌లోడ్‌ చేసి, ఆటోలాక్‌ చేసింది. దీంతో ఆయా భూములకు రక్షణ ఏర్పడింది.

వ్యవసాయ రంగంలో సాగునీటి విప్లవం
సీఎం కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి విప్లవాన్ని తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లను పూర్తి చేశారు. వాటిని నీటితో నింపి అపర భగీరథుడు అన్న పేరును సార్థకం చేసుకున్నారు. రైతు బంధును ఎకరాకు ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచారు. ఈ పథకం ద్వారా ఏటా 57 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. రైతులకు రూ.25 వేల వరకు గల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తద్వారా 5.88 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకు ప్రభుత్వం ఏకంగా రూ.1,210 కోట్లు చెల్లించింది. 2019 జూలైలో రైతులకు వడ్డీ లేని రుణాల బకాయిలు రూ.256 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇక కరోనా సమయంలో పాడి రైతులను ఆదుకునేందుకు రుణ పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. 3 లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను జారీచేసింది. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ ఏడాది 32.73 లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించింది. రూ.3,556 కోట్లు చెల్లించింది. ఇప్పటివరకు 31,654 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.1,582 కోట్లు బీమా కింద చెల్లించడం విశేషం.

నియంత్రిత సాగు:
మూస పద్ధతిలో సాగుతున్న వ్యవసా యాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు తెరలేపింది. సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారు. మార్కెట్లో డిమాండ్‌ గల పంటలను ఎంత విస్తీర్ణంలో పండిరచాలో మార్గనిర్దేశం చేశారు. నియం త్రిత సాగు అనుకున్నదానికి మించి సత్ఫలితాల నిచ్చింది. 1.25 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా 1.35 కోట్ల ఎకరాలకు పైగా సాగు చేయడం విశేషం.

ధాన్యం సేకరణలో రికార్డులు:
2019- 20లో రికార్డుస్థాయిలో 1.12 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దేశంలో మొత్తం ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ వాటానే 63 శాతం. దేశంలో మద్దతు ధరకు రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. గత, ఈ సీజన్‌లో 6,500 వరకు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేసింది. కరోనా సమయంలో రైతులు తమ పంటలను అమ్ముకోవడంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ప్రతి గింజను మద్దతు ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసింది.

రైతు వేదికలు:
రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. సాగు విషయాలను చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించింది. జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను అక్టోబర్‌ 31న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఇక రైతు పండిరచిన పంటను ఆరబెట్టుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష కల్లాలను నిర్మిస్తున్నది.

గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు:
రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు, నిర్మించిన రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2019 నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టం సుమారు 2.58 మీటర్ల నీటి నిల్వలు పెరిగాయి. 2010-19 మధ్య కాలంతో పోల్చినప్పుడు రాష్ట్రంలోని 95శాతం మండలాల్లో 0.2 నుంచి 13.06 మీటర్లలో భూగర్భజలమట్టం పెరిగింది. 2019 జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం కాళేశ్వరం ఫలాలు రాష్ట్రమంతటికీ అందుతున్నాయి. యాసంగి ముగిసేనాటికి 2019-20 నీటి సంవత్సరంలో గోదావరిజలాల వినియోగం 200-250 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదలశాఖ లెక్కలే చెప్తున్నాయి. కఅష్ణా, గోదావరి జలాల్లో మనవాటాను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకఅతులమయ్యాం. 2019-20లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 8,076.83 కోట్లు వెచ్చించగా అందులో 83 శాతం అంటే రూ.6,670.05 కోట్లను కేవలం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనే ప్రభుత్వం ఖర్చు చేసింది. అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. సాగు కష్టాలు తీరాయి.

ఐటీలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ.. ఇప్పుడు జిల్లాలకు విస్త రించింది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన కంపెనీలు ఇప్పుడు పల్లెల బాట పట్టాయి. ఇప్పటికే హైదరాబాద్‌ తర్వాత ఐటీ విస్తరించిన తొలి జిల్లాగా వరంగల్‌ రికార్డు సఅష్టించింది. 27 ఎకరాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్‌) 2016లో ఐటీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత రూ.38 కోట్లతో కరీనంగర్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను గత ఏడాది జూలై 21న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. టవర్‌ను ప్రారంభించేనాటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు 26 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో 15 కంపెనీలకు ఆఫీస్‌ స్పేస్‌ కేటాయించారు. ఈ టవర్‌ ద్వారా మొత్తం 3,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తాజాగా ఐటీరంగం ఖమ్మంలోనూ కాలుమోపింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రూ.27 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 16 కంపెనీలు సిద్ధమయ్యాయి. 430 మందిని నియమించుకున్నాయి. త్వరలో మరో 430 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలోనూ ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ ఐటీ టవర్‌కు బీజం పడింది. కొండపాక మండలం దుద్దెడలో టవర్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటును మించాయి. కరోనా సమయంలో జాతీయస్థాయి లో ఐటీ వఅద్ధిరేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణలో 17 శాతం నమోదైంది. లుక్‌ ఈస్ట్‌ విధానాన్ని అమలు చేస్తుండటంతో హైదరాబాద్‌ నలువైపులా ఐటీ విస్తరిస్తున్నది. అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మైక్రాన్‌ సంస్థ అతిపెద్ద రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నది.

విద్యా రంగం పరుగులు
కేజీ టు పీజీ విద్యలో భాగంగా రాష్ట్రంలో విద్యా వెలుగులు ప్రసరిస్తున్నాయి. గత ఏడాది 119 నియోజక వర్గాల్లో కొత్తగా బీసీ గురుకులాలు ప్రారంభమయ్యాయి. పాతవి 161 గురుకులాలుండగా.. కొత్తగా 119తో మొత్తం 280 వరకు పెరిగాయి. వీటితోపాటు డిగ్రీకాలేజీల్లో కలిపి 3 లక్షల మంది చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నది. సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజీ, రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్టికల్చర్‌ యూనివర్సిటీ భవనాలను ప్రారంభించారు. గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్‌ హబ్‌ ఆదర్శంగా నిలిచింది.

ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌
రెండేండ్లలో హైదరాబాద్‌ విశ్వనగరం దిశగా అనేక అడుగులు పడ్డాయి. 2019 నవంబర్‌ 29న హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభమైంది. నగరంలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబీలు మొదలయ్యాయి. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభమయ్యింది. కరోనా సమయంలో రూ.2 వేల కోట్ల విలువైన 15 ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్ల పనులు, 29 లింకురోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేశారు. హైదరాబాద్‌లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 179 అన్నపూర్ణ భోజనం సెంటర్ల ద్వారా రోజుకు 52 వేలమందికి భోజనం. కరోనా సమయంలో వలస కూలీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.

విద్యుత్‌ వినియోగంలో టాప్‌
విద్యుత్‌ సగటు వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. ఎంత విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరాను నిరంతరాయంగా కొనసాగి స్తున్నది. 2019 మార్చి 25 నుంచి మణు గూరులో బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. అన్నివర్గాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది.

మా తండాలో మా పాలన
రెండో దఫా అధికారంలోకి వచ్చాక ‘మా తండాల్లో మా పాలన’ నినాదం కార్యరూపం దాల్చింది. ప్రభుత్వం కొత్తగా 4,079 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసింది. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది. పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. నెలరోజులు సాగిన పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మార్చింది.

మెరుగైన వైద్యం
వైద్యశాఖలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తూ సామాన్యునికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెరిగాయి. 2015-16 సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరుగుదల నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ లాంటి పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) నివేదిక ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. అంతకుముందు రాష్ట్రంలో 30.5 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో జరుగగా, ప్రస్తుతం అవి 49.7 శాతానికి పెరుగడం గమనార్హం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

2019-20లో పట్టణాల్లో 43.4 శాతం, గ్రామాల్లో 53.6శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్టు పథకంతో 2017 నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ పథకం కింద ఆడ శిశువు పుడితే రూ.13 వేలు, మగ శిశువు పుడితే రూ.12 వేల ప్రోత్సాహకం ఇస్తుండటంతోపాటు మరో రూ.2 వేలు విలువ చేసే కిట్‌ను ఇస్తున్నారు. దవాఖానల్లో సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు మెరుగు పరిచింది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది. 2015-16లో 91.3 శాతం ప్రసవాలు నిపుణుల ఆధ్వర్యంలో జరుగగా, 2019-20లో అది 93.6 శాతానికి పెరిగింది. పట్టణాల్లో ఇది 94.6 శాతం, గ్రామాల్లో 92.9 శాతంగా ఉన్నది.

రాష్ట్రంలో ఎయిమ్స్‌ ప్రారంభమైంది. 2018 ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు పథకం ద్వారా కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అదుతుండటంతో 6 లక్షల ప్రసవాలు జరిగాయి. వీరందరికీ కేసీఆర్‌ కిట్లు అందాయి. సిజేరియన్‌ ఆపరేషన్లు తగ్గించి, సాధారణ డెలివరీలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం డెలివరీలు ఉండగా ఇప్పుడు రెట్టింపయ్యాయి. మెడికల్‌ కాలేజీల్లోనూ ఐసీయూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగదురహితంగా ఎంప్లాయీస్‌, జర్నలిస్టుల హెల్త్‌ స్కీం (ఈజీహెచ్‌ఎస్‌) అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 35 శాతం వరకు సేవలు పెరిగాయి. మృతదేహాల తరలింపునకు 50 పరమపద వాహనాల ఏర్పాటు చేశారు. మూత్రపిండాలు విఫలమైన రోగుల విషయంలో 46
ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరిశ్రమలకు ప్రోత్సాహం
పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి పరిశ్రమలు ఎన్నో హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను తెలంగాణలో ఏర్పాటుకు నిర్ణయించింది. 10 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం, 9 వేల మంది ఉద్యోగులు. గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన రూ.20,760 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ నిర్ణయించింది. బయోఫార్మా రంగానికి ప్రోత్సాహన్నిచ్చారు. రూ.60 కోట్లతో బీ-హబ్‌ ఏర్పాటు చేశారు. సిర్పూర్‌ పేపర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరించి ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ముచ్చర్ల ఫార్మాసిటీ (19,333 ఎకరాలు). రూ.27,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దీనితో 4.25 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ పాలసీ ప్రకటించడంతో పాటు ఎలక్ట్రానిక్‌ వాహనాలు తయారుచేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. వినియోగ దారుల ప్రోత్సాహం కోసం రిజిస్ట్రేషన్‌, రోడ్‌ ట్యాక్స్‌ రద్దు తదితర ప్రోత్సాహకాలు ప్రకటించారు. మొత్తం 14 వేల పరిశ్రమలకు అనుమతు లిచ్చారు. రూ. 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 15 లక్షలమందికి ఉపాధి లభించింది. ఈవోడీబీలో వరుసగా మూడుసార్లు టాప్‌-3లో చోటు దక్కించుకుంది.

ఇలా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ఎన్నో పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కించడంతో పాటు ప్రజల హృదయాల్లో మంచి పాలనను అందిస్తున్న ప్రభుత్వంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.