ప్రగతి భవన్‌లో ఘనంగా శ్రీ శుభకృత్‌ ఉగాది వేడుకలు

శ్రీ శుభకృత్‌’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్‌లోని ‘జనహిత’లో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు పండితుల వేదమంత్రో చ్ఛారణలతో వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వేద మంత్రాలతో ఆశీర్వచనాలిచ్చారు. అనంతరం శృంగేరి పీఠం వేద పండితులు  బాచంపల్లి సంపత్‌ కుమార్‌ సిద్ధాంతి పంచాంగాన్ని పఠించారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వేదపండితులు, అర్చకులను సీఎం కేసీఆర్‌ సన్మానించారు. పలు పుస్తకావిష్కరణలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ‘శుభకృత్‌ ‘ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య పోరాటంతో తెలంగాణ సాధించినమన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలన్నారు. కరెంటు బాధ, మంచినీళ్ల సమస్య.. ఇలా అనేక సమస్యలను అధిగమిస్తూ వచ్చామన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ సాధించిందన్నారు. ప్రజల దీవెన, అధికారుల పనితీరుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ, గత 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో అధిగమించిందన్నారు. రిజర్వ్‌ బ్యాంకు లెక్కల్లోనూ అనేక రాష్ట్రాలను అధిగమించి ప్రగతిపథంలో తెలంగాణ పరుగెడుతున్నదని సీిఎం అన్నారు.

విద్యుత్‌, విద్య, తలసరి ఆదాయం.. ఇలా అనేక విషయాల్లో అద్భుతంగా పురోగతిలో ఉన్నామని, కొన్ని దుష్ట శక్తులు వ్యతిరేకించినా అభివృద్ధిలో ముందుకుపోతున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడిరదని సీఎం తెలిపారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని అన్నారు.

అల్లం నారాయణ ‘ప్రాణహిత’ ద్వారా నాటి ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను వ్యాసాలుగా రాసిన సందర్భాన్ని గుర్తు చేసిన సీఎం కేసీఆర్‌, నేడు స్వరాష్ట్రంలో నాటి సమస్యలన్నీ పరిష్కరించబడినాయని అన్నారు. మేధోమథనం చేసి ఆవిష్కరించిన పథకమే ‘దళిత బంధు’ అని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల కోసమో, ఇంకేదాని కోసమో దళిత బంధును తేలేదనీ, మన దళిత రత్నాలు ప్రపంచానికి తమ సత్తా చాటబోతున్నారని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు తో ఈ దేశానికి తెలంగాణ కొత్త మార్గదర్శనం చేయబోతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టుకున్నామన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసుకున్నామన్నారు. మన వనరులు, మన ఉద్యోగాలు మనకే వచ్చాయన్నారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ పురోగమించాలని, సామూహిక స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’ నిజం కావాలని మనసా వాచా కర్మణా కోరుకుందామని సీఎం ఆకాంక్షించారు.

పరిపాలకుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పాలించినట్లైతే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా చేస్తున్నామన్నారు. వారి వారి మంచి చెడ్డల్ని సంస్కరించి సత్కరించే గొప్ప గుణం తెలంగాణకు ఉన్నదన్నారు. అన్నింటినీ అధిగమించి ప్రగతిపథంలో పయనిస్తున్నామని, రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందని, దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నదన్నారు. అన్ని వర్గాలు బాగున్నప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుంది. అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నమని, అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని, ఆధ్యాత్మిక రంగంలో మన తెలంగాణ దేనికి తీసిపోదని సీఎం కేసీఆర్‌ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ ఏడాది అన్నీ శుభాలే….

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మరింత అద్భుతంగా పరిపాలనను కొనసాగించబోతున్నారని, తెలంగాణలో ఈ సంవత్సరం అనేక శుభ ఫలితాలు కలుగుబోతున్నాయని సిద్ధాంతి బాచంపల్లి పంచాంగం చదివారు.

‘‘ఈ ఏడాది పరిపాలన అద్భుతంగా ఉండబోతున్నది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సీఎం కేసీఆర్‌ జాతకం ఇంకా బాగుంటుంది. సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ సంవత్సరం అనేక సంస్కరణలు చూడబోతున్నారు. దేశమంతా కేసీఆర్‌ చేసే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూడబోతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు. రాష్ట్రంలో వేసవిలోనూ సమృద్ధిగా నీళ్లు లభ్యమౌతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. రైతులందరు మరల రాజులు కాబోతున్నారు. ప్రభుత్వ సలహాలు, సూచనలతో రైతులు పంటలు వేస్తే రైతులు అధిక లాభాలతో ఇంటికి వెళతారు. 

కరోనా వంటి చీకటి రోజులు తొలగిపోయి మంచిరోజులొచ్చాయి. ప్రజారోగ్యం భేష్‌. ఆనందంగా ఊపిరిపీల్చుకుందాం. ఇది ఉద్యోగనామ సంవత్సరం. మహిళలకు అనేక అవకాశాలు వస్తాయి.. వాళ్లే శాసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మహిళా ఐఏఎస్‌ అధికారులకు అద్భుతంగా ఉంది. యావత్‌ భారతదేశం దృష్టి హైదరాబాద్‌ పైనే ఉంటుంది. ప్రపంచంలోనే ముఖ్యమైన నగరంగా ఉండబోతోంది. 75 శాతం మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.. 25 శాతం కొంచం గడ్డు ఫలితాలు ఉండవచ్చు. మీడియాకు ఈ సంవత్సరం పుష్కలంగా వార్తలు లభిస్తాయి. వారు వార్తలకోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు..’’ అంటూ చేసిన పంచాంగ పఠనం వేడుకల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని భవిష్యత్తు పట్ల ఆశాజనక భరోసాను నింపాయి. పంచాంగ పఠనం సందర్భంగా విసిరిన ఛలోక్తులు ప్రకటించిన అంశాలు సభికులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుందని పంచాంగ పఠనం లో పండితులు వివరించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులు కరతాళ ధ్వనులతో ‘జై తెలంగాణ జై కేసీఆర్‌’ నినాదాలతో తమ హర్షద్వానాలను ప్రకటించారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సహా వేద పండితులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి వేదికపై ఆసీనులైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ఆలయ అర్చకులు దేవదాయ శాఖ మంత్రి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానాన్ని అందచేశారు.

సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ సంపాదకీయంలో సీఎం ఒఎస్టీ శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే ప్రచురించిన సాగునీటి రంగం పై సీఎం అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సంకలనం ‘‘మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం’’ అనే పుస్తకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. సంపత్‌ కుమార్‌ సిద్ధాంతి విరచిత పంచాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.