ఇప్పుడు పట్టణాల వంతు..
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. అయినా, ఇది నిరంతరం కొనసాగించాల్సిన కార్యక్రమం. పల్లెల్లో విరివిగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలి. గ్రామాల్లో ఎ్లవేళలా పరిశుభ్రత వెల్లివిరియాలి. ఏదో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనకు రక్షణ చర్యలు గుర్తుకురావడం కాదు. ముందుగానే వాటిని గ్రహించి జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఇప్పటికీ అనేక ప్రాంతాలలో నిరుపయోగంగా పడివున్న బోరింగ్ బావులు మనకి దర్శనమిస్తుంటాయి. ఎవరో పిల్లలు పడి ప్రమాదానికి గురయ్యేదాకా ఎందుకు? అటువంటివాటిని, పాడుబడిన బావులను తక్షణం పూడ్చివేయాలి. మురికిగుంట, చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. అప్పుడే పల్లెప్రగతి కార్యక్రమం పూర్తి లక్ష్యాను సాధిస్తుంది. పల్లెలు ప్రగతిని సాధిస్తాయి.
ఇప్పుడు రాష్ట్రంలో పల్లెలు ప్రగతిసాధించడానికి చక్కటి వాతావరణం నెలకొని ఉంది. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కావల్సిన సకల చర్యలు తీసుకొంటోంది. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యోగ ఖాళీలను భర్తీచేయడంతోపాటు, కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. పల్లెలను బాగుచేసుకోవడానికి ఇవన్నీ సానుకూల అంశాలు. పల్లెప్రగతి కార్యక్రమం కింద సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు పెద్దఎత్తున పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుచేస్తోంది. రాష్ట్రంలో కేవలం 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే వాటి సంఖ్యను ప్రభుత్వం 13కు పెంచింది. మున్సిపాలిటీల సంఖ్య 68 నుంచి 128కి పెరిగింది. మున్సిపాలిటీలో ఖాళీల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పట్టణా అభివృద్ధికి ఇది అనువైన సమయం. స్థానిక సంస్థలన్నింటికీ ఇటీవల విజయవంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త సారధులు, సరికొత్త పాలక మండలిలు ఏర్పాటయ్యాయి. వార్డుల వారీగా పట్టణప్రగతి ప్రణాళికలు రూపొందించుకొని, దానికి అనుగుణంగా ముందుకుసాగాలి. ప్రతీ పట్టణంలో కనీస పౌర సదుపాయాలు ఏమిటో నిర్థారించుకొని వాటికి ప్రాధాన్యత నివ్వాలి.
పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వాధికారులకు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి నేరుగా దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా, అవినీతికి మారుపేరుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తూ, ఈ చెడ్డపేరును తొలగించుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు కూడా.
ఇప్పుడు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతో పట్టణాల దశ దిశ మారాలని, మారుతుందనీ ఆశిద్దాం.