భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్‌లో భాగంగా 587 కోట్లతో ఓఅర్‌ఆర్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టును రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ని మణికొండ అల్కాపురిలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మునిసిపల్‌శాఖ మంత్రి కె. తారకరామారావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ 978 కాలనీలకు నీళ్లు ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి క్యాబినెట్‌లో పట్టుబట్టారు. కొండపోచంపల్లి నుంచి గండిపేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రిరకింగ్‌ వాటర్‌ స్కీమ్‌ తీసుకున్నాం. హైదరాబాద్‌ అంటే GHMC ఒక్కటే కాదు ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్‌గా గుర్తించాలి. హైదరాబాద్‌ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఢల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ఇరిగేషన్‌ కోసం మాత్రమే కాదు,మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్‌ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.

మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ పరిధిలో అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రత్యేకమైన విజన్‌తో ముఖ్యమంత్రి నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీిఆర్‌ నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రజలు గమనించాలి. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒక్క రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేశారు. నార్సింగ్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌ పై వెళ్ళడానికి అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. జిహెచ్‌ఎంసితో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం… నాలాలు, రోడ్లు, చెరువుల సుందరీకరణ, త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌్‌ తీగల అనితా హరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌ రెడ్డి, వాణీదేవి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జలమండలి ఎం.డి దానకిషోర్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.