ఇవి పేదల ఆత్మగౌరవ శిఖరాలు
దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్ (సిసి నగర్)లో రూ. 1922 లక్షల వ్యయంతో నిర్మించిన 258 రెండు పడకల గదుల ఇళ్లను హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ, నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెప్పేవారని, కానీ మన ముఖ్య మంత్రి ఇళ్లు నేనే కట్టిస్తానని…పెళ్లికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నారని మంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సరిగ్గా సబ్సిడీ బియ్యం వచ్చేవి కావు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికి త్రాగునీరు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ గృహ నిర్మాణానికి పెట్టినఖర్చు మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేదని, రాష్ట్రంలో రూ. 18వేల కోట్ల భారీ బడ్జెట్ తో పేదల సొంతింటి కలను నిజం చేశామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ముఖ్యమంత్రి విజన్ అని తెలిపారు. ఇప్పటి వరకు రూ.11వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలందరికీ అందిస్తామని మంత్రి కె.టి.ఆర్ తెలిపారు.
పేదల సొంతింటి కలను పూర్తిచేసిన ఏకైక సి.ఎం కె.సి.ఆర్ అని అన్నారు. ఇక్కడ నిర్మించిన ఇళ్లకు మార్కెట్ విలువ రూ. 40 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని, కానీ ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా భారం వేయకుండా అందిస్తున్నారని మంత్రి తెలిపారు. దళారులకు, పైరవీలకు అవకాశమే లేదని, ఇక్కడ ఉన్న వారికి న్యాయం జరుగుతుందని మంత్రి కె.టి.ఆర్ అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పేదలు గొప్పగా బ్రతకాలని, ఒక్క రూపాయి తీసుకోకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదన్నారు. గతంలో 15, 20, 30 గజాలలో అరకొర వసతులతో ఉన్న పేదలకు ప్రస్తుతం అన్ని మౌలిక వసతులతో కూడిన 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని, ఇక్కడ బస్తీలో ఉన్నవారికే న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లినా వాళ్ల కోసం వారం రోజుల్లో ఇల్లు కేటాయింపు జరుపుతామని, అప్పటి వరకు ఓపికతో ఉండాలన్నారు. ఈ గృహాలను కొనడం కానీ, అమ్మడం గానీ చేయకుండా, తమ పిల్లలు తరతరాలుగా ఉపయోగించు కోవాలని తెలిపారు. నియోజకర్గ ప్రజలను 25 సంవత్సరాల పాటు కన్నబిడ్డల వలే కాపాడుకున్నామని అన్నారు. వారికి ఆపద వచ్చినప్పుడు అన్నివిధాల ఆదుకోవడం తన బాధ్యత అని గుర్తుచేశారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కె.సి.ఆర్ నిర్మిస్తున్నారని, నెహ్రూ జమానా నుండి పేదలకు ఎవ్వరు కూడా గృహాలు నిర్మించలేదని, చాచా నెహ్రూ నగర్లో గృహాలు నిర్మించిన ఘనత కె.సి.ఆర్ కే దక్కుతుందన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పించన్ లాంటి పథకాలు భారతదేశంలో మరెక్కడాలేవన్నారు.
రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ. 18వేల కోట్ల విలువగల ఇళ్లను మంజూరు చేయగా రూ. 11 కోట్ల విలువ గల గృహాలు పూర్తిచేసి పేదలకు అందజేసినట్లు మంత్రి తెలిపారు. పేదలు ఆత్మగౌరవంగా బ్రతకాలన్నదే కె.సి.ఆర్ లక్ష్యమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గృహ నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇక్కడ ఇల్లు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, హౌసింగ్ సి.ఇ సురేష్, కార్పొరేటర్ హేమలత లక్ష్మి పతి, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.