ఆరోగ్య తెలంగాణకు బాటలు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. ప్రజా వైద్యం ఆరోగ్య రంగాలలో తెలంగాణ రోజు రోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తున్నదని తెలిపారు.

రాష్ట్రం నలుమూలలా వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి, దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచిందన్నారు.
ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచేందుకు మానవ వనరుల పెంపునకు చర్యలు చేపట్టామని సీఎం అన్నారు. వైద్యశాఖలో 21,073 పోస్ట్లు కొత్తగా మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటు నిర్మాణం, ఎంసిహెచ్ కేంద్రాలు, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల పెంపుతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతపరుస్తున్నామన్నారు.

ప్రజలవద్దకే వైద్యం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నా యన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటయిన పల్లె దవాఖానల్లో సేవలందుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానల ద్వారా 81 లక్షల మందికి, 2,250 పల్లె దవాఖానల ద్వారా 19.61 లక్షల మందికి వైద్య సేవలను అందించడం జరిగిందన్నారు.
కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తతను కనబరుస్తున్నదన్నారు. మాత శిశు సంరక్షణ కేంద్రాలు, అమ్మఒడి వాహనాలు, ఆలనవాహనాలు, పరమ పద వాహనాలు, మార్చురీ ల ఆధునీకరణ, కాత్ ల్యాబ్ కేంద్రాలు, అవయవ మార్పిడి కేంద్రాలు, స్టెమ్ సెల్ థెరపీ కేంద్రాలు, జెనోమిక్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇవన్నీ ప్రజారోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తు శుద్ధికి నిదర్శనాలన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేస్తున్నామని సీఎం అన్నారు.
పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, ఎన్ సిడి స్క్రీనింగ్ ప్రోగ్రాం, మిడ్ వైఫరీ ప్రోగ్రాం, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుధ్య నిర్వహణ పాలసీ, ఆసుపత్రులలో రోగులకు డైట్ చార్జెస్ పెంపు, ఆసుపత్రులలో సహాయకులకు సబ్సిడీ భోజనం వంటివి అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతపరిచామన్నారు. ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు, వైద్య సిబ్బందికి వేతనాలు పెంపు చేశామని, పలు ప్రోత్సాహకాలను పెంపు చేయటం జరిగిందన్నారు. ఉద్యోగులకు, జర్నలిస్ట్లకు హెల్త్ స్కీంను అమలు చేస్తున్నామన్నారు. ఈ వైద్యులకు యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు చేస్తున్నామన్నారు. నర్సులు ఇతర సిబ్బందికి పీఆర్సీని అమలు, పీజీ స్టూడెంట్స్, హౌస్ సర్జన్లకు వేతనాలు పెంచామన్నారు. ఆశా కార్యకర్తలు, కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు వేతనాలను గుణాత్మకంగా పెంచామని సీఎం కేసీఆర్ తెలిపారు.
కరోనా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను నిర్వహించి కరోనా ముందస్తు కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరాలజీ (ఆర్టీపీసీఆర్) కేంద్రం ఏర్పాటు, విజయవంతంగా కోవిడ్ వాక్సినేషన్ నిర్వహణ, రాష్ట్రంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం వంటి చర్యలు కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు నిదర్శనంగా నిలిచాయన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మూడంచెల వ్యవస్థ నుండి ఐదంచెల వ్యవస్థ కు విస్తరించామన్నారు. ఆరోగ్య సేవల వికేంద్రీకరణ చేపట్టి జిల్లా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసిందన్నారు.
ప్రాథమిక (పిహెచ్సీ, సీహెచ్సీ), ద్వితీయ (ఎహెచ్, డిహెచ్), తృతీయ – బోధనా ఆసుపత్రి, కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రివెంటివ్ వైద్యం కోసం పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, సూపర్ స్పెషలిటీ లో టిమ్స్ ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పన చేసిందన్నారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన దవాఖానాల్లో పడకల సంఖ్యను పెంచడం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రసూతి కేంద్రాల ఆధునీకరణతో పాటు, పాలియేటివ్ సేవా కేంద్రాలు, అవయవ మార్పిడి కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, లివర్ మార్పిడీ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. బోన్ మారో & స్టెమ్ సెల్ చికిత్స కేంద్రాల ఏర్పాటయ్యాయన్నారు.
కేసీఆర్ కిట్ ద్వారా 13లక్షల 29 వేల 951 గర్భిణీ స్త్రీలకు లబ్ధి చేకూర్చామన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దిశగా దేశ చరిత్రలోనే మున్నెన్నడు ఇటువంటి వైద్య కార్యాచారణ చేపట్టలేదని సీఎం స్పష్టం చేశారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా 10 లక్షల 85 వేల 448 కిట్లకు పైగా ఇప్పటి వరకు పంపిణీి చేశామన్నారు. అందుకోసం రూ.1,387 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. 2018 – 19 కాలంలో కంటి వెలుగు ద్వారా 1.5 కోట్ల జనాభాకు స్క్రీనింగ్ చేసి, వారిలో 41 లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందన్నారు.
ఇప్పటి వరకు 10 వేల మంది మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు 45 లక్షల సెషన్లల్లో దేశంలోనే ప్రప్రధమంగా సింగిల్ డయాలిసిస్ పద్ధతి ద్వారా వైద్య సేవలందించామని సీఎం అన్నారు. ఇందుకు రూ. 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. డయాలిసిస్ రోగులకు కిడ్నీ మార్పిడి, మందులు, బస్ పాస్ ఉచితంగా అందించామన్నారు.
108 వాహనాల సంఖ్యను 330 నుండి 426కు పెంచడం, వీటి ద్వారా 17.65 లక్షల మందికి అత్యవసర సేవలు అందివ్వడం జరిగిందన్నారు. అమ్మఒడి వాహనాల ద్వారా ఇప్పటివరకు 38.7 లక్షల గర్భిణీలకు సేవలందిచామన్నారు. 50 పరమపద వాహనాల ద్వారా, 33 ఆలన వాహనాల ద్వారా, టెలిమెడిసిన్ సేవలు, స్పెషలిస్ట్ ల సేవలు అందించడం జరిగిందన్నారు. అత్యవసర వైద్య సేవల్లో భాగంగా డ్రోన్ల ద్వారా మందులను అందించే విప్లవాత్మక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటిని ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. తద్వారా నీటి కాలుష్యం ద్వారా వ్యాపించే వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. డయేరియా లాంటి అనేక జబ్బులను నిలువరించడం జరిగిందన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారిని తెలంగాణ నుంచి లేకుండా తరిమికొట్టగలిగామన్నారు.
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్ధులకు మేలు చేకూర్చడం కోసం చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్ ర్యాంక్లతో పాటుగా నాణ్యమైన సేవలను అందించడంలో జాతీయస్థాయి గుర్తింపులు, ప్రశంసలను సాధించిందన్నారు. వైద్యం ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ లో దేశంలోనే మూడవ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణ మన్నారు. రాష్ట్రంలోమెరుగైన వైద్య సేవలకోసం పనిచేస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రిని, వైద్య శాఖ అధికారులను సిబ్బందిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.